నాకు కరోనా సోకలేదు: రేణూ దేశాయ్
పలు దేశాల్లో స్ట్రైయిన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాల్సిందేనని అటు ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఇటు దేశాధినేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని వారు చెబుతూ వస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. సామాన్యులే కాదు... పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇక ఇప్పటికే చాలా మంది ఈ మహమ్మారిని జయించగా.. కొందరు కన్నుమూశారు. ఇదిలా ఉంటే నటి రేణు దేశాయ్కి కూడా కరోనా సోకగా.. ఆ తరువాత కోలుకున్నారట. ఈ విషయాన్ని తాజాగా లైవ్లో వెల్లడించించారని వార్తలు వచ్చాయి. అయితే రేణూ దేశాయ్ వాటిని ఖండిస్తూ పోస్ట్ పెట్టారు.
రేణు దేశాయ్ మాట్లాడుతూ.."నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. నిన్న ఓ ఫంక్షన్కు వెళ్తే అందరూ నన్ను అదోలా చూశారు. నాకసలు బాధ్యత లేని మనిషిని అన్నట్లుగా చూపులతో గుచ్చారు. అందుకే ఈ పోస్టు పెడుతున్నా. నాకు కరోనా వస్తే ఆ విషయాన్ని స్వయంగా నేనే వెల్లడిస్తాను, అంతేకాదు బాధ్యత గల వ్యక్తిగా ఎటువంటి కార్యక్రమాలకు కూడా హాజరవను" అని తేల్చి చెప్పారు.
అలాగే తనకు కరోనా అంటూ తప్పుడు వార్తలను రాసినవారిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది నిజం? ఏది అబద్ధమో తెలుసుకుని రాయండని అసహనానికి లోనయ్యారు. ఇలా వచ్చే రాసే వార్తలను నమ్మకండని అభిమానులకు సూచించారు. వాళ్లు కేవలం సెలబ్రిటీల మీద తప్పుడు వార్తలు రాస్తూ బతుకుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అబద్ధాల పుట్టలు సృష్టించే అకౌంట్లను అస్సలు ఫాలో అవకండని మరీ మరీ చెప్పారు.
ఇన్స్టా లైవ్లో పాల్గొన్న రేణు దేశాయ్.. అక్కడ అభిమానులు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందులో భాగంగా మీరు మహేష్ బాబు సర్కారు పాటలో నటిస్తున్నారా..? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. లేదని స్పష్టం చేశారు. ఏదైనా ఉంటే తాను ఇన్స్టాలో పోస్ట్ చేస్తానని రేణు వెల్లడించారు.