`విరాటపర్వం` చిత్రంపై రానా షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ఇలాంటి సినిమాలు చేయోద్దని ఫ్యాన్స్ చెప్పినట్టు తెలిపారు.

విలక్షణ నటుడిగా తెలుగులో రాణిస్తున్న రానా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రయోగాలు చేయబోనని తెలిపారు. అభిమానుల కోసమే ఇక నుంచి సినిమాలు చేస్తానని తెలిపారు. అంతేకాదు `విరాటపర్వం` చిత్రంపై కూడా ఆయన షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ఇలాంటి సినిమాలు చేయోద్దని ఫ్యాన్స్ చెప్పినట్టు తెలిపారు. తాను ఇలాంటి సినిమాలు చేయనని స్పష్టం చేశారు రానా. సాయిపల్లవితో కలిసి ఆయన నటించిన `విరాటపర్వం` చిత్రం ఈ నెల 17న విడుదల కానున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు.

`విరాటపర్వం` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రానా మాట్లాడుతూ, విరాటపర్వం ఈవెంట్‌కి వచ్చిన వెంకటేష్‌కి థ్యాంక్స్ చెప్పారు. ఆయన లేకుండా ఇంట్లో ఏ చిన్న శుభకార్యం కూడా జరగదని తెలిపారు. అనంతరం ఇక్కడున్న సాయిపల్లవి ఫ్యాన్స్ అందరికి వెల్‌కమ్‌ అని చెప్పగానే ప్రాంగణం మారుమోగింది. కాసేపటి వరకు అరుపులు వినిపించాయి. దీంతో సాయిపల్లవి పవర్‌ అంటే ఇది అని రానా కితాబిచ్చారు. ఇందులో రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పారు రానా. రామ్‌చరణ్‌ ఈ ఈవెంట్‌కి రావాల్సి ఉండగా, ఆయన ఫ్లైట్‌ మిస్‌ అయ్యి హైదరాబాద్‌కి రాలేకపోయారని తెలిపారు. ఆయన తరఫున ఫ్యాన్స్ కి తాను సారీ చెబుతున్నానన్నారు. రామ్‌చరణ్‌ తన పెళ్లి రోజు సందర్భంగా భార్య ఉపాసనతో ఇటలీలో విహరిస్తున్న విషయం తెలిసిందే. 

అనంతరం రానా మాట్లాడుతూ, దర్శకుడు వేణుపై ప్రశంసలు కురిపించారు. ఆయన ఎంతో నిజాయితీతో తీసిన చిత్రమిది అని తెలిపారు. తను పెరిగిన ఊర్లలో, పెరిగిన పరిస్థితుల్లో నుంచి ఒక భయంకరమైన బ్యాక్‌డ్రాప్‌లో ఒక అద్భుతమైన ప్రేమకథని తెరకెక్కించారు. ఈ కథకి తనని ఎంచుకున్న వేణుకి ధన్యవాదాలు చెప్పారు. ఆ భయంకరమైన బ్యాక్‌ డ్రాప్‌లో బ్యూటీఫుల్‌ లవ్‌ స్టోరీ ఉందని, అది సాయిపల్లవితో ఉన్న లవ్‌ స్టోరీ అని చెప్పారు. సాయిపల్లవి నడుస్తుంటే వెన్నెల పక్కన తిరుగుతున్నట్టు ఉంటుంది. ఈ సినిమాలో ఎవరు ఉన్నా లేకున్నా సాయిపల్లవి లేకపోతే ఈ సినిమా ఉండేది కాదన్నారు రానా. ఆమెతో పనిచేయడం గౌరవంగా ఉందన్నారు.

ఇలాంటి కథలను తీసే నిర్మాతలు అరుదుగా ఉంటారని, ఈ చిత్రాన్ని నిర్మించిన శ్రీకాంత్‌, సుధాకర్‌ చెరుకూరిలకు అభినందనలు తెలిపారు రానా. వీరితోపాటు ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు పేరుపేరునా ఆయన ధన్యవాదాలు చెప్పారు. రవన్న దళమైన ప్రియమణి, నవీన్‌ చంద్ర, జరీనా వాహెబ్‌, నందితా దాస్‌, ఈశ్వరీ రావులకు థ్యాంక్స్ చెప్పారు. సినిమాలో ఆరు ముఖ్య పాత్రలుంటే అందులో ఐదు ఆడవారే చేశారని తెలిపారు. ఇదొక పెద్ద మహిళల చిత్రమన్నారు. ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్‌ తో పనిచేయడం ఆనందంగా ఉందని, ఫస్ట్ టైమ్ ఎలాంటి గాయలు లేకుండా చేశామని, ఇకపై కూడా ఇలానే గాయలు లేకుండా ఆయనతో కలిసి సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు రానా. 

అనంతరం రానా చెబుతూ పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించారు. ఇప్పటి వరకు తనకు విక్టరీ వెంకటేష్‌గారి ఫ్యాన్సే ఉంటారనుకున్నా, నాకు సెపరేట్‌గా ఫ్యాన్స్‌ ఉంటారనుకోలేదు. నాకేదో సినిమాలు నచ్చి, కొత్త కొత్త కథలు చెప్పాలనుకుంటూ డిఫరెంట్‌ సినిమాలు చేస్తూ వచ్చాను. కానీ ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు నాకు ఎంత మంది ఫ్యాన్స్‌ ఉన్నారో అర్థమైంది. ఎందుకంటే ఇలాంటి సినిమాని చేయోద్దని వారు నాకు తెలిపారు. ఇదే నా చివరి ప్రయోగం. ఇకపై మీకోసం(ఫ్యాన్స్) సినిమాలు చేస్తా. ఇకపై పిచ్చెక్కిద్దాం` అని తెలిపారు రానా.