Rana Daggubati: ఒకప్పుడు తన ప్రాణాలకే ప్రమాదం వచ్చిందని, చనిపోవడానికి 30% అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారని రానా దగ్గుబాటి తాజాగా వెల్లడించారు. తాను కమిట్ అయిన సినిమాల అడ్వాన్సులు కూడా తిరిగి ఇచ్చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
చావు అంచుల వరకు వెళ్లిన రానా దగ్గుబాటి
రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' సినిమాలో భళ్లాలదేవుడిగా మనందరిని అలరించారు రానా దగ్గుబాటి. ఆ పాత్రతో రానాకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అయితే, తాజాగా ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న ఓ పెద్ద ఆరోగ్య సంక్షోభం గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. తనకు మొదటిసారి అనారోగ్యం అని తెలిసినప్పుడు అది పెద్ద షాక్ అని, అప్పట్లో బతకడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని రానా గుర్తుచేసుకున్నారు. చనిపోవడానికి 30 శాతం అవకాశం ఉందని డాక్టర్లు చెప్పినట్లు తెలిపారు.
కిడ్నీ సమస్యతో బాధపడిన రానా
`నా కిడ్నీలు పాడయ్యాయి. 70 శాతం స్ట్రోక్ , బ్రెయిన్ హెమరేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. చనిపోవడానికి 30 శాతం అవకాశం ఉంది. కానీ సినిమాలే నన్ను బతికించాయి. ఒక హీరోలా తిరిగి రావాలని నేర్పించాయి. కెరీర్లో ఒక పెద్ద హిట్ కొట్టి మంచి ఫామ్లో ఉన్నప్పుడే నా ఆరోగ్యం దెబ్బతింది. ట్రీట్మెంట్ కోసం సినిమాలకు బ్రేక్ తీసుకున్నాను. అమెరికాలో చికిత్స తీసుకుంటున్నప్పుడు నా ధ్యాస మొత్తం నా శరీరం మీదే ఉండేది. ఎలాగైనా తిరిగి రావాలనుకున్నాను` అని రానా చెప్పారు.
అడ్వాన్సులు తిరిగివ్వాల్సి వచ్చింది
ఆయన ఇంకా చెబుతూ, `ఏడాది ట్రీట్మెంట్ తర్వాత ఇండియాకు తిరిగొచ్చాను. కానీ ఆ జబ్బు, చికిత్స, మందుల వల్ల నా రూపం చాలా మారిపోయింది. ఆ మార్పును అంగీకరించడానికి చాలా కష్టపడ్డాను. అలా మారిపోయిన రూపంతో, అనారోగ్యానికి ముందు ఒప్పుకున్న చాలా సినిమాల అడ్వాన్సులు తిరిగి ఇచ్చేశాను. ఒక రెజ్లర్ కథతో సినిమా చేయాల్సి ఉండేది. కానీ ట్రీట్మెంట్ తర్వాత ఆ పాత్రకు కావాల్సిన ఫిజిక్ నా దగ్గర లేదు. అందుకే ఆ సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ మొత్తం తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది` అని రానా వివరించారు. రియా చక్రవర్తితో జరిగిన ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో రానా ఈ విషయాలన్నీ పంచుకున్నారు. రానా చివరగా `కాంతా`లో కీలక పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే.


