తెలంగాణ బతుకమ్మ సంబురాల ఆఖరు రోజు తెలంగాణ బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా సంబురంగా ఆడుకుంటున్న పండుగ బతుకమ్మ సంబురాల్లో పాల్గొని వన్నెలద్దిన మెగా దంపతులు ఉపాసన, రామ్ చరణ్ 

పువ్వులను పూజించే సంస్కృతి గల్ల తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగకున్న ప్రాముఖ్యతే వేరు. పిల్లా పాపలతో ఆడబిడ్డలు సంబురంగా పూలను పేర్చి బతుకమ్మను ఆడుకునే సంస్కృతి అనాదిగా వస్తోంది. ఈ పూవుల పండగ కాల క్రమేణా కొత్త సొబగులు అద్దుకుంటోంది. భాగ్యనగరంలో దాండియాతో మిక్స్ చేసి బతుకమ్మ ఆడేస్తున్నారు. మహిళల పండగైనా.. మగవాళ్లు కూడా మొహమాటం లేకుండా పాల్గొంటున్నారు. బతుకమ్మ ఆడాలనే క్రేజ్.. సెలబ్రిటీల్లోనూ పెరిగిపోయింది.

తాజాగా గురువారం (సెప్టెంబర్ 28) జరిగిన స‌ద్దుల బ‌తుక‌మ్మ వేడుకల్లో యువ కథానాయకుడు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన, సోదరి నిహారిక పాల్గొన్నారు. హైద‌రాబాద్‌ విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీలోని గిల్డ్ ఆఫ్ స‌ర్వీస్ సేవా స‌మాజ్ బాలిక నిల‌యం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన బ‌తుక‌మ్మ సంబురాల్లో వీరంతా ఆడి పాడారు.



ఈ వేడుకల్లో ఉపాసన, నిహారికతో పాటు చెర్రీ కూడా బతుకమ్మ ఆడి అనాథ బాలికలంద‌రినీ ఉత్సాహ‌ప‌రిచారు. ఆ తర్వాత బాలికలతో కలిసి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను చెర్రీ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. ఉపాసన కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను పంచుకున్నారు.

‘బాలికా నిలయంలో దసరా, బతుకమ్మ సంబరాలు. పదేళ్లుగా మీరు చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు. ఇలాగే అనేక ఏళ్లు సాగాలని కోరుకుంటున్నా’ అని కామెంట్ రాసుకొచ్చాడు. చెర్రీ సినీ ఇండస్ట్రీకి వచ్చి సెప్టెంబర్ 28తో పదేళ్లు పూర్తయ్యాయి

Scroll to load tweet…