చరణ్ రంగమ్మత్తా అంటుంటే... అదోలా అనిపించింది-అనసూయ
బుల్లితెర ప్రముఖ యాంకర్ అనసూయ తాజాగా... కీ రోల్ ప్లే చేసిన చిత్రం ‘రంగస్థలం’. రామ్చరణ్,సమంత జంటగా నటించిన ఈ చిత్రంలో... హిరోయిన్ కాకున్నా సమంత తో పోటీ పడి మరీ రంగమ్మత్త పాత్రలో నటించింది అనసూయ. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 30న విడుదలై ఘనవిజయం సాధించింది. రంగమ్మత్త కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్న నేపథ్యంలో విలేకరులతో పలు విశేషాలు పంచుకున్నారు. ఆ విశేషాలు ఏంటో చూద్దాం.
రంగస్థలంలో చేసిన రంగమ్మత్త పాత్ర గురించి...
‘‘రంగమ్మత్త’ పాత్ర చెప్పినప్పుడు రెండు విధాలుగా ఆలోచించా. ఈ పాత్ర ప్రేక్షకులకు నచ్చితే బాగా నచ్చుతుంది.. లేకపోతే ఏ మాత్రం నచ్చదు అనుకున్నా. అనుకూల స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఓ పాత్రను ఒప్పుకునే ముందు చాలా ఆలోచిస్తా. కానీ కొన్ని సార్లు తెలియక తప్పులు చేస్తుంటా. ‘రంగమ్మత్త’ గెటప్ వేసుకున్న తర్వాత టెలివిజన్ ఇమేజ్ను పూర్తిగా మర్చిపోయి, ఆ పాత్రలోకి వెళ్లిపోయేదాన్ని. సినిమా కోసం జూబ్లీహిల్స్లో ఆర్ట్డైరెక్టర్ రామకృష్ణ అద్భుతమైన పల్లెటూరు సెట్ వేశారు. తొలుత నేను దాన్ని చూసి, అది నిజం అనుకున్నా. కానీ అది సెట్ అని తర్వాత చెప్పారు.’
ఎలాంటి పాత్రలు చేయాలనిపిస్తుంది...
‘నేను నటిని కావాలని నిర్ణయించుకున్న తర్వాత ఎలాంటి పాత్రలు చేయొచ్చని ఆలోచించా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ మిగిలిన వాటిలా కాదు. ప్రేక్షకులు అంత సులభంగా పెళ్లైన నటీమణులను స్వీకరించరు. సమంత పెళ్లైన తర్వాత తీసిన ‘రంగస్థలం’ మంచి హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇకపై మన చిత్ర పరిశ్రమ మారుతుంది అనుకుంటున్నా. ఆర్టిస్టుగా నన్ను నేను నిరూపించుకోవడానికి ఏ పాత్ర అయినా సరే.. అనుకుని సినిమాల్లోకి వచ్చా. ‘క్షణం’ సినిమాలో నా పాత్ర కోసం కేవలం 40 రోజులు షూటింగ్లో పాల్గొన్నా. కానీ అది చాలా ముఖ్యమైన పాత్ర. ‘సోగ్గాడే చిన్నినాయనా’లో నేను మరదలి పాత్ర పోషించా. అందులో హీరోయిన్ లావణ్యత్రిపాఠి భార్య పాత్రలో నటించారు. సినిమాలో నా పాత్ర ప్రభావం నాకు ముఖ్యం.. నటుడు ప్రకాశ్రాజ్లా అవ్వాలనేది నా ఆశ. ఆయన మామయ్య, నాన్న, విలన్, తాతయ్య.. ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోతారు. ప్రేక్షకుల్ని మెప్పిస్తారు’.
‘‘రంగమ్మత్త’ పాత్రలో ఇంకా బాగా నటించి ఉంటే బాగుండేది అనిపించింది. సమంత, రామ్చరణ్ పాత్రల్లా నాది లేదు అనిపించింది. సుకుమార్, ఆయన టీం మొత్తం కలిసి నాకు చాలా సహాయం చేశారు. డబ్బింగ్లో కూడా సలహాలు ఇచ్చారు. అయినప్పటికీ ‘రంగమ్మత్త’ పాత్రకు వంద శాతం న్యాయం చేశాననిపించలేదు’.
చరణ్ తో కలిసి నటించడం, అనుభవాలు...
‘సినిమాలోని పడవ సన్నివేశం రామ్చరణ్తో నా మొదటి షూట్. చరణ్ సూపర్స్టార్.. ఆయనతో కలిసి నేను నటిస్తున్న పెద్ద ప్రాజెక్టు ఇది. ఆ రోజు చాలా ఒత్తిడికి గురయ్యా. కానీ షూట్ చాలా సంతృప్తిగా జరిగింది. చరణ్తో నటన సౌకర్యంగా అనిపించింది. ఆయన అత్త అన్నప్పుడు చాలా ఏడ్చా (నవ్వుతూ). సెట్లో అందరూ ‘రంగమ్మత్త’ అని పిలిచేవారు’.
మీపై వస్తున్న విమర్శలపై ఎలా స్పందిస్తారు...
‘నేను చెప్పేది, చేసేది ఎందుకు ప్రజలకు నచ్చదు? వారి వైపు నుంచే ఆలోచిద్దాం అనుకునే సమయంలో ‘రంగస్థలం’ సినిమా నా దగ్గరకు వచ్చింది. ఈ చిత్రంతో వ్యక్తిగా నేను చాలా మారిపోయా.. మొదట నాకు చాలా కోపం వచ్చేది. నాకు పెళ్లైతే వీరికేంటి, పిల్లలుంటే వీరికేంటి? అనుకునేదాన్ని. కానీ బాలీవుడ్లో ఇలా లేదు. అక్కడ మలైకా అరోరా 14 ఏళ్ల అబ్బాయికి తల్లి. కానీ ఆమెకు అక్కడ మంచి క్రేజ్ ఉంది. నేను చేసే పాత్రలు కొంత మందికి నచ్చుతాయి, మరికొందరికి నచ్చవు. ‘రంగమ్మత్త’ పాత్రను మెచ్చుకున్న వారు చాలా ఉన్నారు. కొంతమంది ఫోన్లు చేసి.. ‘మా అమ్మకు నీ పాత్ర నచ్చింది, మా బామ్మకు నచ్చింది’ అన్నారు’.
‘అర్జున్రెడ్డి’ సినిమాను విమర్శించడం గురించి...
‘‘అర్జున్రెడ్డి’ సినిమాపై నేను ఎందుకు స్పందించానంటే.. ఇంతకు ముందు సినిమాల్లో విలన్లు మాత్రమే పోకిరీలుగా ఉండేవారు. హీరోలు మంచిగా ఉండేవారు. దీంతో యువత హీరోలాగే మనం కూడా ఉండాలి అనుకునేది. కానీ ఇప్పుడు హీరోలు కూడా అలానే ఉన్నారు. ఇది తప్పు అనిపించి సినిమాపై అలా స్పందించా. నేను చెప్పిన విషయం అందరికీ అర్థం కాలేదు’.
మీపై వచ్చే రూమర్స్ గురించి ఏమంటారు...
‘కెరీర్ ప్రారంభంలో నాకు, ఓ దర్శకుడికి అఫైర్ ఉందని రాసేశారు. ఇదేంటి అనుకున్నా. ‘నేను నమ్మిన రోజు నువ్వు ఏడు’ అని నా భర్త చెప్పారు. ఆయన, మా కుటుంబ సభ్యులు నన్ను చాలా ప్రోత్సహిస్తారు. ‘రంగమ్మత్త’ పాత్ర బాగుందని మా ఆయన మెచ్చుకున్నారు. అదే నాకు లభించిన ఉత్తమ ప్రశంస’. ‘విన్నర్’ సినిమాలో పాటకు ప్రశంసలు వచ్చాయి. దీనికి ముందు నాతో కలిసి పనిచేసిన దర్శకులు నాకు ఫోన్లు చేసి.. ‘ఇలాంటి టాలెంట్ను మేము సరిగ్గా వాడుకోలేదు’ అన్నారు. నేను ఎక్కడికి వెళ్లడం లేదు.. ఇప్పటికైనా నా కోసం పాత్రలు రాయండి అన్నా (నవ్వుతూ)’. ‘ఓ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు సుకుమార్ ‘ఆర్య’లో నటించే అవకాశం ఇచ్చారు. కానీ చిత్ర పరిశ్రమ అనగానే తొలుత కాస్త భయపడ్డా. ‘నేను ‘ఆర్య’ కోసం అడిగినప్పుడు ఎందుకు చేయలేదు’ అని సుకుమార్ ఇప్పుడు కూడా అడుగుతుంటారు. ‘అప్పుడు నేను ‘ఆర్య’ చేస్తే మీకు ఇప్పుడు ‘రంగమ్మత్త’ దొరికేది కాదుగా’ అన్నాను.
‘ఇప్పుడు నేను ‘సచ్చిందిరా గొర్రె’ అనే సినిమాలో నటిస్తున్నా. ‘విన్నర్’ సినిమా తర్వాత నాకు పాటల్లో నటించే అవకాశాలు వచ్చాయి. కానీ చేయలేదు’. ‘నాకు డబ్బులు అవసరం. అలాగనని డబ్బుల కోసమే నేను ఇక్కడికి రాలేదు. మంచి పాత్రల్లో నటించి, పేరు తెచ్చుకోవడం నాకు ముఖ్యం’ అని అనసూయ చెప్పుకొచ్చారు.