వరుసగా రెండు ప్లాప్ ఇచ్చిన రామ్ రెమ్యునరేషన్ ఇరవై కోట్లు అంట. వంద కోట్ల పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో యాభై శాతం డైరెక్టర్, హీరో రెమ్యూనరేషన్స్ కే సమర్పించుకుంటున్నారట. ప్రస్తుతం ఇది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.


చిత్ర పరిశ్రమ అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. టాలీవుడ్ వరుస డిజాస్టర్స్ తో చతికిలపడింది. అయినా హీరోలు, దర్శకులు మాత్రం తమ రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం లేదు. మహేష్ సర్కారు వారి పాట మినహాయిస్తే ఈ మధ్య కాలంలో విడుదలైన చిత్రాలన్నీ నష్టాలు మిగిల్చాయి. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించిన ఆచార్య, నాగ చైతన్య థాంక్యూ (Thank You)ఎపిక్ డిజాస్టర్స్ గా రికార్డులకు ఎక్కాయి. ఓటీటీ ట్రెండ్, పెరిగిన టికెట్స్ ధరలు ప్రేక్షకులను థియేటర్స్ కి దూరం చేస్తున్నాయి. ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్న చిత్రాలు కూడా భారీ నష్టాలు మిగుల్చుతున్నాయి. 

ఈ క్రమంలో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఏపీ/తెలంగాణా రాష్ట్రాల్లో టికెట్స్ ధరలు సవరిస్తూ కొత్త ప్రతిపాదనలు చేశారు. అలాగే ఆరు కోట్ల బడ్జెట్ లోపు చిత్రాలు నాలుగు వారాలు, ఆపై బడ్జెట్ తో తెరకెక్కే చిత్రాలు పది వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో విడుదల చేయాలన్న నిబంధన తీసుకొచ్చారు. అలాగే పరిశ్రమలో హీరోలు, దర్శకులు మాత్రమే హ్యాపీగా ఉన్నారు. ఫేక్ కలెక్షన్స్ చూపెడుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నిర్మాతలు, బయ్యర్లు నష్టపోతున్నారని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

పరిస్థితులు ఇంతలా దిగజారినా ప్లాప్ హీరోలు కూడా రెమ్యూనరేషన్ తగ్గించడం లేదు. సినిమా బడ్జెట్ ఆధారంగా రెమ్యూనరేషన్ ఫిక్స్ చేస్తున్నారు. టైర్ టూ హీరోగా ఉన్న రామ్ పోతినేని కూడా రూ. 20 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడంటే నిర్మాతలు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. బోయపాటి దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) పాన్ ఇండియా మూవీ ప్రకటించగా  ఆయన రెమ్యూనరేషన్ ఇరవై కోట్లు అంట. రామ్ గత రెండు చిత్రాలు రెడ్, ది వారియర్ రూ. 20 కోట్లు షేర్ రాబట్టడానికి ముక్కి మూలిగాయి. ఒక్క ఇస్మార్ట్ శంకర్ మూవీ మినహాయిస్తే... రామ్ కెరీర్ లో రూ. 25 కోట్ల షేర్ దాటిన సినిమా లేదు. 

కేవలం దర్శకుడు బోయపాటి శ్రీను కావడం వలన రామ్ కి అంత మొత్తంలో ఇస్తున్నారట. మరో ఇరవై కోట్లు బోయపాటి రెమ్యూనరేషన్ గా తెలుస్తుంది. వంద కోట్ల ఈ పాన్ ఇండియా మూవీ బడ్జెట్ లో రూ. 40 కోట్లు ఇద్దరి రెమ్యూనరేషన్స్ గా చెల్లిస్తున్నారట. దిల్ రాజు సైతం ప్రేక్షకులు ఎలా ఆలోచిస్తున్నారో తెలియక అనేక కొత్త ప్రాజెక్ట్స్ పక్కన పెట్టారు. కానీ కొందరు నిర్మాతలు ఇలా గుడ్డిగా ముందుకు వెళ్లి నష్టపోతున్నారు. మరి చూడాలి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నిర్మాతలను ముంచేనో తేల్చేనో...