బాలీవుడ్ లో చరణ్ క్రేజ్!
బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయి పెరిగిందనే చెప్పాలి
బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయి పెరిగిందనే చెప్పాలి. ఆ తరువాత కూడా టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదిస్తున్నారు టాలీవుడ్ ఫిలిం మేకర్స్. మన హీరోల మార్కెట్ కూడా పెరుగుతోంది. తెలుగులో వచ్చిన చిత్రాలను హిందీలో కూడా రీమేక్ చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమాను హిందీలో అనువదించనున్నారు. దీని రైట్స్ కోసం 'రంగస్థలం' నిర్మాతలకు బాగానే ముట్టజెప్పారు.
చరణ్ ప్రత్యేకంగా ముంబై వెళ్లి ఈ సినిమాను ప్రమోట్ కూడా చేశారు. తాజాగా చరణ్-బోయపాటి సినిమాకు బాలీవుడ్ లో మంచి డీల్ కుదిరిందని తెలుస్తోంది. హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో ఈ సినిమాకు ఏకంగా రూ.21 కోట్ల రూపాయలు వచ్చాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపనీ ఇంత మొత్తాన్ని చెల్లించినట్లు సమాచారం.
చరణ్ కెరీర్ లో ఈ రేంజ్ లో డబ్బింగ్ రైట్స్ అమ్ముడవడం ఇదే తొలిసారి. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, కియారా అద్వానీ వంటి బాలీవుడ్ స్టార్స్ ఉండడం కూడా మార్కెట్ పరంగా కలిసొస్తోంది. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.