మరోసారి తల్లైన రజనీకాంత్ కూతురు.. పండంటి బిడ్డకి జన్మనిచ్చిన సౌందర్య
రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ రెండోసారి తల్లయ్యింది. ఆమె పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ఆ విషయాన్ని తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసింది సౌందర్య.
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ మరోసారి తల్లి అయ్యారు. ఆమె ఆదివారం పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారు. సౌందర్య కి ఇప్పటికే కుమారుడు వేద్ కృష్ణ(మొదటి భర్తకి జన్మించిన) ఉన్నారు. ఇప్పుడు సౌందర్య, విషగన్ వనంగమూడి దంపతులకు కుమారుడు జన్మించడం విశేషం. అంతేకాదు ఆ చిన్నారికి నామకరణం కూడా చేశారు. `వీర్ రజనీకాంత్ వనంగమూడి` అనే పేరు పెట్టారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ సౌందర్య రజనీకాంత్ ట్విట్ చేసింది. `దేవుడి దయ, తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో వేద్ కృష్ణ తమ్ముడు వీర్ రజనీకాంత్ వనంగమూడికి విషగన్, వేద్, నేను స్వాగతం పలుకుతున్నాం. ఈ సందర్భంగా సహకరించిన డాక్టర్లు సుమన మనోహర్, డాక్టర్ శ్రీ విద్యశేషాద్రిలకు ధన్యవాదాలు` అని పేర్కొంది సౌందర్య రజనీకాంత్. ఈ సందర్భంగా కుమారుడు, భర్తతోపాటు రెండో కుమారుడితో దిగిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది సౌందర్య. తన సంతోషాన్ని పంచుకుంది.
సౌందర్యకి మొదట బిజినెస్ మ్యాన్ అశ్విన్ కుమార్తో వివాహం జరిగింది. వీరికి వేద్ కృష్ణ జన్మించారు. కొన్నాళ్లకి విడిపోయారు. అనంతరం 2019లో వ్యాపారవేత్త విషగన్ వనంగమూడిని సౌందర్య సెకండ్ మ్యారేజ్ చేసుకోగా, ఇప్పుడు వీరికి బాబు వీర్ జన్మించడం విశేషం. రజనీకాంత్ రెండో కుమార్తె అయిన సౌందర్య రజనీకాంత్ దర్శకురాలిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆమె మొదట గ్రాఫిక్ డిజైనర్గా పనిచేశారు.
`పడయప్ప`, `బాబా`, `చంద్రముఖి`, `అన్బే ఆరుయిరే`, `శివకాశి`, `మజా`, `పందెంకోడి`, `చెన్నై600028`, `శివాజీ` చిత్రాలకు గ్రాఫిక్ డిజైనర్గా పనిచేశారు. `కథానాయకుడు` చిత్రంలో గెస్ట్ రోల్లో మెరిసింది. `గోవా` చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది. మరోవైపు రజనీకాంత్తో యానిమేషన్ మూవీ `కొచ్చడయాన్` చిత్రానికి దర్శకత్వం వహించింది. దీంతోపాటు ధనుష్తో `వీఐపీ2` సినిమాని తెరకెక్కించింది. దర్శకురాలిగా ఆమె ఇంకా సక్సెస్ ని అందుకోలేకపోవడం గమనార్హం.