రజనీ కుమార్తె ఐశ్వర్య దర్శకురాలిగా తెలుగులో స్ట్రెయిట్ సినిమా
ధనుష్ భార్య, దర్శకురాలు ఐశ్వర్యా ఆర్ ధనుష్ తెలుగులో సినిమా చేయబోతుంది. దర్శకురాలిగా లైకా ప్రొడక్షన్తో కలిసి ఓ స్ట్రెయిట్ సినిమా చేయబోతున్నట్టు వెల్లడించారు. ఐశ్వర్య.. రజనీకాంత్ కూతురనే విషయం తెలిసిందే.
సూపర్స్టార్ రజనీకాంత్(rajinikanth) తనయ, ధనుష్(dhanush) భార్య ఐశ్వర్య ఆర్ ధనుష్(aishwaryaa r dhanush) దర్శకురాలిగా మరో ప్రయత్నం చేస్తుంది. ఈ సారి తెలుగులో డైరెక్ట్ సినిమా చేసేందుకు రెడీ అవుతుంది. అందుకు `2.0` వంటి భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ నిర్మించేందుకు ముందుకు రావడం విశేషం. సుభాస్కరన్, మహవీర్ జైన్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఐశ్వర్య గతంలో ధనుష్ హీరోగా `3` సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయ్యింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ ఈ సినిమాలోని `కొలవెరి` సాంగ్ మాత్రం ఇండియా వైడ్ గా దుమ్మురేపింది. ఆ తర్వాత `వెయ్ రాజా వెయ్` చిత్రంతో దర్శకురాలిగా నిరూపించుకుంది ఐశ్వర్య. పాన్ ఇండియన్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్య ఆర్. ధనుష్ మాట్లాడుతూ `లైకా ప్రొడక్షన్స్లో ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నాను. పాన్ ఇండియన్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని తీస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది` అని చెప్పారు.
లైకా ప్రొడక్షన్స్ సీఈవో ఆశిష్ సింగ్ మాట్లాడుతూ `మా సంస్థలో తొలి స్ట్రయిట్ తెలుగు సినిమాకు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుండటం మాకెంతో ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం మాకుంది` అని చెప్పారు. సినిమాలో నటీనటులు, పని చేయబోయే సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. లైకా ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న `రామ్ సేతు`తో హిందీ పరిశ్రమలోకి ప్రవేశిస్తోంది. జాన్వీ కపూర్ కథానాయికగా `గుడ్ లక్ జెర్రీ` నిర్మిస్తోంది. హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాలు నిర్మిస్తోంది.