హై కోర్టు వార్నింగ్ తో వెనక్కు తగ్గిన రజనీ
ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కోర్టును ఆశ్రయించిన స్టార్ హీరో రజనీకాంత్ వెనక్కు తగ్గారు. కోర్టు హెచ్చరికల తరువాత, తన క్లయింట్ పిటిషన్ ను వెనక్కు తీసుకున్నారని రజనీ తరఫు న్యాయవాది వెల్లడించారు.
తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. దాంతో చెల్లించాల్సిన రూ. 6.50 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కోర్టును ఆశ్రయించిన స్టార్ హీరో రజనీకాంత్ వెనక్కు తగ్గారు. కోర్టు హెచ్చరికల తరువాత, తన క్లయింట్ పిటిషన్ ను వెనక్కు తీసుకున్నారని రజనీ తరఫు న్యాయవాది వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే...రజినీకాంత్ కు చెందిన ‘రాఘవేంద్ర కళ్యాణ మండపం’ఫై అన్నాడీఎంకేపార్టీ ఆస్తి పన్ను వేసిన వ్యవహారం రాజకీయంగా వేడి పెంచింది. కోడంబాక్కం పరిధిలో ఉన్న రాఘవేంద్ర మండపానికి 2019-20లో చెన్నై కార్పొరేషన్ రూ. 6.5 లక్షల ఆస్తి పన్ను కట్టాలని నోటీసులు పంపారు.
అయితే కరోనా కారణంగా మార్చిలో విధించిన లాక్డౌన్ నాటినుంచి రాఘవేంద్ర కల్యాణ మండపం మూసివేసి ఉందని, అప్పటి నుంచి ఎలాంటి ఆదాయం లేనందున గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ విధించిన ఆస్తి పన్ను చెల్లించలేమని.. ఈ మిషయంపై సెప్టెంబర్ 23న కార్పొరేషన్కు రజనీకాంత్ నోటీసు పంపారని రజినీ తరపు లాయర్ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు.
మార్చి 24 నుంచి అన్ని మ్యారేజ్ హాల్స్ బుకింగ్స్ నూ ప్రభుత్వం రద్దు చేసిందని కూడా గుర్తు చేశారు. చెన్నై మునిసిపల్ కార్పొరేషన్ చట్టం 1919లోని సెక్షన్ 105ను ఉదహరిస్తూ, ఆస్తి పన్నును తగ్గించాలని అన్నారు. రజనీకాంత్ పిటిషన్పై బుధవారం మద్రాస్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం రజనీ అపీల్ ను కోర్టు తోసిపుచ్చింది. అయితే ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా ధర్మాసనాన్ని ఆశ్రయించడంపై మద్రాస్ హైకోర్టు జడ్జి అనిత సుమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పన్నును చెల్లించకుండా దానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినందుకు జరిమానా విధించాల్సి ఉంటుందని రజినీని కోర్టు హెచ్చరించింది. అయితే ఈ కేసును ఉపసంహరించుకోవడానికి తమకు కొంత సమయం కావాలని రజినీకాంత్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు.