Radheshyam Postponed: రాధేశ్యామ్ వాయిదా.. మీ ప్రేమతో మళ్లీ వస్తాం..
అనుకన్నదే జరిగింది. ప్రభాస్ హీరోగా రూపొందిన పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` వాయిదా పడింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమాని వాయిదా వేస్తున్నట్టు యూనిట్ వెల్లడించింది.
ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా `రాధేశ్యామ్`. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కావాల్సి ఉంది. రిలీజ్ కోసం అన్ని రకాలుగా సిద్ధమయ్యింది యూనిట్. కానీ ఊహించని రీతిలో కరోనా మహమ్మారి వెంటాడుతుంది. థర్డ్ వేవ్ ముంచుకొస్తుంది. దీంతో ఇప్పటికే పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్` వాయిదా పడింది. తాజాగా `రాధేశ్యామ్` కూడా వెనక్కి తగ్గింది. ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో సినిమాని విడుదల చేయడం సరికాదని భావించిన యూనిట్ వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు.
నిజానికి `ఆర్ఆర్ఆర్` వాయిదా టైమ్లోనే `రాధేశ్యామ్`(Radheshyam Postponed) కూడా వాయిదా పడుతుందనే వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని, వాయిదాపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అనుకున్న డేట్కే రిలీజ్ ఉంటుందని వెల్లడించింది యూనిట్. కానీ నిన్న ఒక్కరోజే తెలంగాణలోనూ భారీగా కేసులు పెరిగాయి. కరోనా ఆంక్షలు రాబోతున్నాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో `రాధేశ్యామ్`ని వాయిదా వేస్తున్నట్టు యూనిట్ వెల్లడించింది.
`సినిమాని విడుదల చేయడానికి సంబంధించి గత కొన్ని రోజులుగా మేం చాలా ప్రయత్నించాం. కానీ కరోనా కేసులు, ఒమిక్రాన్ వేరియంట్ మరింతగా పెరుగుతున్నాయి. దీంతో వెనక్కి తగ్గాల్సి వచ్చిందని, సినిమాని బిగ్ స్క్రీన్పై కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. రాధేశ్యామ్ స్టోరీనే ప్రేమ, విధి మధ్య పోటీగా సాగుతుంది. అలాగే మీడి ప్రేమతో ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కొని తిరిగి వస్తాం` అని వెల్లడించింది యూనిట్. త్వరలోనే సినిమాని తెరపైకి తీసుకొస్తామని తెలిపింది.
ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న `రాధేశ్యామ్` చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శఖత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. కృష్ణంరాజు సినిమాకి సమర్పకులుగా వ్యవహరించడంతోపాటు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.