నంది అవార్డుల కమిటీపై ఆర్.నారాయణమూర్తి ఫైర్
- నంది అవార్డుల ఎంపికపై కొనసాగుతున్న రచ్చ
- ఎంపిక పారదర్శకంగా సాగలేదంటూ విమర్శలు
- రుద్రమదేవికి అవార్డు ఇవ్వకపోవడం దౌర్బాగ్యమన్న ఆర్ నారాయణమూర్తి
నంది అవార్డుల జాబితాపై సీనియర్ నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవార్డుల తీరుపై నారాయణమూర్తి అసంతృప్తి గళం వినిపించారు. ఎంపిక ప్రాతిపదికను ఈ రెబల్ స్టార్ తప్పు పట్టారు. ప్రత్యేకించి బాహుబలి సినిమాకు నంది దక్కడాన్ని నారాయణమూర్తి ఆక్షేపించారు.
ఇంతకీ నారాయణమూర్తి ఏమన్నారంటే.. ‘బాహుబలి గొప్ప సినిమానే. సాంకేతికంగా, వాణిజ్యపరంగా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. దర్శకుడు రాజమౌళికి సెల్యూట్. కానీ బాహుబలి చరిత్ర కాదు, సందేశాత్మక చిత్రమూ కాదు. అదొక కమర్షియల్ సినిమా మాత్రమే. దానికి జాతీయ అవార్డు వచ్చినప్పుడే అవార్డుల మీద నమ్మకం పోయింది. ఇప్పుడు మళ్లీ నంది కూడా ఇచ్చారు.
నిజానికి రుద్రమదేవి సినిమా చారిత్రక సినిమా. ఈ సినిమాకు నంది దక్కాల్సింది’ అని నారాయణ మూర్తి అన్నారు. గతంలో విలువలు, మానవీయతకు అద్దం పట్టే సినిమాకు నంది అవార్డులు ఇచ్చేవారని, ఇప్పుడు ఈ అవార్డులు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు కేరాఫ్ గా మారాయని నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.