'మహేష్ బాబుకు బ్యాడ్ న్యూస్'.. పీవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు!
మహర్షి నిర్మాతలలో ఒకరైన పీవీపీ విజయవాడలో ప్రేక్షకులతో కలసి మహర్షి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన మహేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Hyderabad, First Published May 9, 2019, 6:37 PM IST
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహర్షి చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. దిల్ రాజు, అశ్విని దత్, పీవీపీ ముగ్గురూ మహర్షి చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. అంతే భారీ అంచనాలతో ఈ చిత్రం విడుదలయింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించాడు.
మహర్షి నిర్మాతలలో ఒకరైన పీవీపీ విజయవాడలో ప్రేక్షకులతో కలసి మహర్షి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన మహేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీవీపీ మాట్లాడుతూ.. వారం క్రితమే తాను మహర్షి చిత్రం చూశానని అన్నారు. వెంటనే మహేష్ బాబుకు ఫోన్ చేసి మీకు ఓ బ్యాడ్ న్యూస్ అని చెప్పా. దీనితో మహేష్ కాస్త కంగారుగా ఏమైంది అని అడిగారు. కంగారు పడాల్సిందేమి లేదు అని మహర్షి చిత్రం గురించి చెప్పా.
మహర్షి చిత్రానికి మించిన హిట్ మీరు కొట్టలేరు.. అనే మీకు బ్యాడ్ న్యూస్ అని మహేష్ కు తెలిపా. మహర్షి చిత్రం మీ కెరీర్ లో తిరుగులేని బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పగానే మహేష్ సంతోషపడ్డారు. దాదాపు మూడేళ్ళ క్రితమే మహర్షి చిత్రానికి బీజం పడిందని పీవీపీ తెలిపారు. ఆ తర్వాత దిల్ రాజు, అశ్విని దత్ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించామని వెల్లడించారు.
మహర్షి చిత్రంలో మహేష్ బాబు పాత్ర మూడు కోణాల్లో ఉంటుంది. కాలేజీ స్టూడెంట్ గా, కార్పొరేట్ సంస్థ సీఈఓగా, రైతుల సమస్యలపై పోరాటం చేసే వ్యక్తిగా మహేష్ పాత్రని వంశీ పైడిపల్లి తీర్చిదిద్దారు. గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహర్షి చిత్రం వసూళ్ల పరంగా ఏ స్థాయి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
Last Updated May 9, 2019, 6:42 PM IST