రెండు దశాబ్దాల తర్వాత నాగార్జునని కలుస్తున్న పూరీ జగన్నాథ్.. ఇద్దరిలో ఎవరు సెట్ అవుతారో?
నాగార్జున, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన `శివమణి` అప్పట్లో ట్రెండ్ సెంటర్. యూత్ని బాగా ప్రభావితం చేసిన చిత్రాల్లో ఒకటి. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలుస్తున్నారా?
కింగ్ నాగార్జున, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా వచ్చి చాలా ఏళ్లు అవుతుంది. `శివమణి`తో ప్రారంభమైన వీరి జర్నీ `సూపర్`తో ఆగిపోయింది. మళ్లీ ఈ ఇద్దరు ఎప్పుడూ కలవలేదు. కానీ `శివమణి`తో ఓ ట్రెండ్ సృష్టించారు. ఈ మూవీలో ఫోన్ నెంబర్ ఓ రేంజ్లో ఊపేసింది. అప్పటి యూత్ని బాగా ప్రభావితం చేసింది. అంతటి పెద్ద హిట్ని నాగ్కి అందించారు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో `సూపర్` మూవీ వచ్చింది. అనుష్కని పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రమిది. సినిమా ఆడలేదు. దీంతో నాగార్జున, పూరీలకు మధ్య గ్యాప్ వచ్చింది.
ఆ తర్వాత పూరీ జగన్నాథ్ యంగ్ హీరోల వైపు టర్న్ తీసుకున్నారు. దాదాపు అందరు హీరోలతోనూ సినిమాలు చేశారు. అందరికి సూపర్ హిట్లు ఇచ్చారు. అంతేకాదు మాస్ హీరోలుగా నిలబెట్టాడు పూరీ. కానీ ఇటీవల కాలంలో ఆయన రూపొందించిన మూవీస్ పెద్దగా ఆడలేదు. వరుస పరాజయాల అనంతరం `ఇస్మార్ట్ శంకర్` పెద్ద హిట్ అయ్యింది. కానీ తర్వాతి సినిమా బోల్తా కొట్టింది. విజయ్ దేవరకొండతో పాన్ ఇండియామూవీ `లైగర్` చేశారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం చెందింది. దీంతో మళ్లీ రామ్తో కలిసి `ఇస్మార్ట్ శంకర్`కి సీక్వెల్ `డబుల్ ఇస్మార్ట్`మూవీని రూపొందిస్తున్నారు.
మరోవైపు నాగార్జున కెరీర్ కూడా సాఫీగా సాగడం లేదు. సక్సెస్ ల కంటే పరాజయాల ఎక్కువగా ఎదురవుతున్నాయి. చాలా సినిమాల తర్వాత ఈ ఏడాది `నా సామిరంగ`తో హిట్ కొట్టాడు. ఇప్పుడు మళ్లీ అదే దర్శకుడితో సినిమా చేస్తున్నారు. అలాగే ధనుష్తో `కుబేర`, రజనీకాంత్తో `కూలీ` చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు నాగార్జున. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి ప్లాన్ జరుగుతుందట. పూరీ జగన్నాథ్తో నాగ్ సినిమా చేయబోతున్నారని సమాచారం. ప్రస్తుతం నాగ్తో ఓ మూవీకి సంబంధించిన చర్చలు జరుపుతున్నారట పూరీ. మరి అన్ని కుదిరితే ఈ మూవీ సెట్ అయితే ఇరవై ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ కలవబోతుందని చెప్పొచ్చు. మరి అది వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి.
అంతేకాదు పూరీ జగన్నాథ్ మరో సినిమాకి చర్చలు జరుపుతున్నారు. `హనుమాన్`తో హిట్ కొట్టిన తేజ సజ్జాతోనూ ఓ సినిమా చేయాలని భావిస్తున్నారట. గతంలో విజయ్ దేవరకొండతో `జనగణమన` సినిమాని ప్రకటించారు పూరీ. అదే స్క్రిప్ట్ ని తేజతో చేయాలనుకుంటున్నట్టు సమాచారం. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.