Puneeth Rajkumar Death: తొలిసారి స్పందించిన పునీత్ భార్య అశ్విని.. అభిమానులకు రిక్వెస్ట్
తమ అభిమాన నటుడు పునీత్ రాజ్కుమార్ లేడనే వార్తతో ఇప్పటికే 12 మంది అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు పునీత్ ఫ్యామిలీని మరింతగా కలచివేస్తున్నాయి.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్(Puneeth Rajkumar) హఠాన్మరణం శాండల్ వుడ్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. పవర్స్టార్గా కన్నడ చిత్ర పరిశ్రమలో భారీ ఫాలోయింగ్ ని, స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్న ఆయన మరణం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా ఆ విషాదం నుంచి బయటపడలేకపోతున్నారు. తమ అభిమాన నటుడు లేడనే వార్తతో ఇప్పటికే 12 మంది అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు Puneeth Rajkumar ఫ్యామిలీని మరింతగా కలచివేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా పునీత్ రాజ్కుమార్ భార్య అశ్విని(Aswini) స్పందించారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలిపారు. పునీత్ రాజ్కుమార్ మరణం తమ కుటుంబానికి తీరని లోటని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దని తెలిపారు. `అప్పు(పునీత్ రాజ్కుమార్) లేడన్న విషయాన్ని మేం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ఎనలేని ప్రేమకి ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఆయన మన మధ్య లేకపోయినా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. దయజేసి అభిమానులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడి మీ కుటుంబాన్ని ఒంటరి చేయోద్దు` అని తెలిపింది అశ్విని.
ఆమెతోపాటు హీరో శివరాజ్ కుమార్, పునీత్ మరో సోదరుడు రాఘవేంద్రలు సైతం అభిమానులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. అంత్యక్రియల దృశ్యాలను కూడా పదేపదే ప్రసారం చేయోద్దని మీడియాకి విజ్ఞప్తి చేశారు. పునీత్ రాజ్కుమార్ గత శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. మార్నింగ్ జిమ్లో వర్కౌట్ చేస్తున్న సమయంలో హార్ట్ ఎటాక్ రావడంతో పునీత్రాజ్కుమార్ కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన ఆయన్ని సమీపంలోని విక్రమ్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే.
కన్నడ కంఠీరవ రాజ్కుమార్ మూడో తనయుడు పునీత్. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని నటుడిగా ఎదిగాడు. బాలనటుడిగానే వెండితెరకి పరిచయమైన పునీత్ రాజ్కుమార్ చైల్డ్ ఆర్టిస్టుగానే జాతీయ అవార్డు అందుకున్నారు. ఇక `అప్పు` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇది తెలుగులో వచ్చిన `ఇడియట్` చిత్రానికి రీమేక్. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఓవర్ నైట్లో స్టార్ అయిపోయాడు పునీత్. దీంతో తొలి చిత్రాన్నే తన ముద్దు పేరుగా మార్చుకున్నారు. కన్నడనాట అభిమానులు ఆయన్ని ముద్దుగా అప్పుగా పిలుచుకుంటారు. ఇప్పుడు అప్పు మరణంతో శోకసంద్రంలోమునిగిపోయారు.
మరోవైపు పునీత్ ప్రస్తుతం రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో `జేమ్స్` అనే సినిమా ఆల్మోస్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇందులో బాడీగార్డ్ పాత్రలో పునీత్ నటిస్తున్నారు. అయితే ఆ పాత్ర కోసమే ఆయన కండలు తిరిగిన దేహంతో కనిపించాల్సి ఉందని, అందుకోసమే ఓవర్గా వర్కౌట్స్ చేస్తున్నాడని, దీని కారణంగానే ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చిందనే కామెంట్లు వినిపించాయి. మరోవైపు ఈ సినిమాని ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుందని సమాచారం.
also read: పునీత్ సమాధి వద్ద కన్నీరు మున్నీరైన సూర్య.. మేమిద్దరం గర్భంలో ఉన్నప్పుడే..