శ్రీరెడ్డిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పవన్ కల్యాణ్
తెలుగు సినీ పరిశ్రమలో గత కొంత కాలంగా జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు చేసి వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తామంటూ... అమ్మాయిలను లోబరుచుకుని వ్యభిచారిణులుగా మారుస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి.. పలువురు ప్రముఖుల బండారాలు బట్టబయలు చేస్తానంటూ ముందుకొచ్చింది.
ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన పలువురు నిర్మాతలు, దర్శకులపై లీక్స్ ఇచ్చి సంచలనానికి తెరలేపిన శ్రీ రెడ్డి తాజాగా శేఖర్ కమ్ములపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తనకు పలువురు నుంచి బెదిరింపులు వస్తున్నాయని.. అయితే తన వెనుక తెలంగాణ ప్రభుత్వాధినేత కేసీఆఱ్ వున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి.
అయితే గత కొంత కాలంగా కాస్టింగ్ కౌచ్ పై దుమారం రేగుతున్న నేపథ్యంలో.. శ్రీ రెడ్డి పలు చర్చా కార్యక్రమాల్లో మాట్లాడుతూ.. నలుగురి చేతుల్లోకి పరిశ్రమ వెళ్లినందువల్లే అమ్మాయిలకు ఇలాంటి దుస్థితి దాపురించినందని ఆరోపిస్తూ వచ్చింది. అయితే తెలుగమ్మాయిలు కాని పలువురు హిరోయిన్లపైనా..... రకరకాల వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. దీంతో ఆగ్రహించిన మా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాజాగా... హైద్రాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ప్రముఖులను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న శ్రీ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు రెండు రోజుల క్రితం టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే నా వెనుక కేసీఆర్ వున్నారంటున్న శ్రీ రెడ్డి పై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది చర్చనీయాంశంగా మారింది.