ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన పిలుపు మేరకు చిరంజీవి ఇటీవల టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మాత నట్టి కుమార్ మంగళవారం మీడియాతో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవిపై ఫైర్ అయ్యారు నిర్మాత నట్టి కుమార్. ఇటీవల జరిగిన మీటింగ్లో తమలాంటి చిన్న నిర్మాతలకు, ఇతర పెద్ద హీరోలకు, ఇతర 24 క్రాఫ్ట్ ల వారిని పిలవకపోవడంపై ఆయన మండిపడ్డారు. చిరంజీవి విభజించి పాలించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాసరి నారాయణరావు మాదిరిగా చిరు కూడా అందరివాడిలా ఉండాలని, కానీ ఆయన వ్యవహారం చూస్తుంటే కొందరి వాడిలా కనిపిస్తుందని విమర్శించారు.
ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన పిలుపు మేరకు చిరంజీవి ఇటీవల టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మాత నట్టి కుమార్ మంగళవారం మీడియాతో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పలు ఆరోపణలు చేశారు. నట్టి కుమార్ మాట్లాడుతూ, `మెగాస్టార్ చిరంజీవిగారంటే నమ్మకం, గౌరవం ఉంది. దాసరిగారి తర్వాత చిరంజీవిగారే ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని ఫస్ట్ అన్నది నేనే. కానీ విభజించి పాలించడం మానుకోవాలి.
లాస్ట్ టైమ్ కూడా చిరంజీవిగారి ఇంటి వద్దే మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ సారాంశం ఏమిటి? చిన్న సినిమా నిర్మాతలు మీకు గుర్తున్నారా.. లేరా? ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే `మా` అసోసియేషన్ ఒక్కటే కాదు, 24 శాఖలు ఉంటాయని చిరంజీవి గ్రహించాలి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ను, ఫిల్మ్ ఛాంబర్ను ఆహ్వానించకుండా చిరంజీవినే ఏపీ సీఎం జగన్ పర్సనల్గా ఎందుకు పిలుస్తున్నారు? ఇండస్ట్రీలోని పెద్ద హీరోలను, నిర్మాతల మండలి వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీని ఎందుకు పిలవలేదు? చిరంజీవి మీటింగ్లో నాగార్జున, పెద్ద నిర్మాతలు తప్ప.. ఇతర పెద్ద హీరోలు, చిన్న నిర్మాతలు ఒక్కరూ లేరు.
చిరంజీవి చిన్న, పెద్ద వాళ్ళను కలుపుకొనిపోవాలి. ఇకనైనా ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని చిరంజీవిగారు అందరివాడిగా ముందుకు సాగాలి. గతంలో చిరంజీవిగారు, నాగార్జునగారు తదితరులు అందరూ ఏపీ సీఎం మీటింగ్కు వెళ్లారు. అప్పటి హామీలు ఒక్కటీ నెరవేరలేదు. ఆ హామీలను ఎంతవరకు ఫాలోఅప్ చేశారు? కరోనా టైమ్లో థియేటర్స్కి 3 నెలలు కరెంట్ బిల్లు సబ్సిడి ఇస్తామని హామీ ఇచ్చారు. అది ఇంత వరకు అమలు కాలేద`ని నట్టి కుమార్ ప్రశ్నించారు.
ఇంకా ఆయన చెబుతూ, `వకీల్ సాబ్` సినిమా టైమ్లో ఏపీ ప్రభుత్వం 35 జివో తెచ్చింది. మంచో చెడో ఆ జీవోని మేము స్వాగతిస్తున్నాం. సినిమా టికెట్ 100 రూపాయల కంటే ఎక్కువ ఉండకూడదు. ప్రేక్షకులపై భారం పడకూడదు. కానీ B, C సెంటర్స్లోని థియేటర్లలో టికెట్ రేటు రూ. 35 నుంచి 80 చేయాలి. చిన్న సినిమాలు బతకాలి. టికెట్ 100 రూపాయలు ఉండటం వల్లే `తిమ్మరసు`, `ఎస్ఆర్ కల్యాణ మండపం` సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. కాబట్టి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన 35 జివోను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకూడదు. మీ పెద్ద సినిమాలకు టికెట్ రేట్స్ రెండు వారాలు పెంచుకోండి. అందుకు 69 జీవో కూడా ఉంది.
మరి మీరు మీటింగ్కు వెళ్లి ఏం చర్చిస్తారు? చూస్తుంటే.. ఇది స్వార్థపు మీటింగ్లా అనిపిస్తుంది. `161 జీవోలో విశాఖలో 320 ఎకరాల భూమి ఇచ్చి షూటింగ్స్ చేసుకోమని అనుమతి ఇస్తున్నాం. మీరు హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చి షూటింగ్స్ చేసుకోండి. మా ప్రేక్షకులు మీకు 70 శాతం రెవిన్యూ ఇస్తున్నారు. మీరు ఇక్కడకు వచ్చి మాకు కూడా టాక్స్లు కట్టండి` అని ఏపీ ప్రభుత్వం అంటుంటే దీనిపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు.
అసలు దేనికోసం మీరు సీఎంను కలవడానికి వెళుతున్నారు?. మీ పర్సనల్ వ్యవహారాలైతే మేము మాట్లాడం. ఏపీలో 35 జీవో అమలు కావడం లేదు. టికెట్కు రూ. 100 రూపాయలు వసూల్ చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, ఎమ్ఆర్ఓలతో మాట్లాడినా ప్రయోజనం లేదు. ఒక్క ‘వకీల్సాబ్’ సినిమాకు మాత్రమే మాకు ఆర్డర్స్ వచ్చాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ జీవో గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదని అంటున్నారు. ఇక చిన్న సినిమాకు 5వ షో నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఇంతవరకు కాలేదు. తెలంగాణలో సినిమా హబ్ అని ప్రకటిస్తున్నారు.. మరి ఏపీ పరిస్థితి ఏంటి?` అని నట్టి కుమార్ ప్రశ్నించారు.
`ఓటీటీలో పెద్ద సినిమాలు విడుదల చేస్తూ థియేటర్లకు అన్యాయం చేస్తున్నారు. సురేష్ బాబు `నారప్ప` సినిమాను ఓటీటీలో విడుదల చేశారు. థియేటర్ల వల్లే తాము పెద్ద వాళ్లం అయ్యామని, మాకు ఇంతమంది అభిమానులు ఏర్పడ్డారని, ఇంత ఇమేజ్ వచ్చిందని సినీ పెద్దలు మరచిపోకూడదు. కాబట్టి ఇండస్ట్రీ సమస్యలు తెలుసుకోవడానికి చిన్న, పెద్ద అందరితో చర్చలు జరిపి, ఆ తర్వాత ప్రభుత్వం దృష్టికి వాటిని తీసుకువెళ్లాలని చిరంజీవిగారిని కోరుతున్నా`నని చెప్పారు నట్టికుమార్.
