నాని వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆయన పెయిన్తో అన్నారుః దిల్ రాజు చురకలు..
టికెట్ల రేట్లు తగ్గించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నాని వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు స్పందించి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో దిల్రాజు నాని వ్యాఖ్యలపై స్పందించారు.
`శ్యామ్సింగరాయ్` ప్రెస్మీట్లో నాని మాట్లాడిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నిజానికి ఆయన భావం అది కాదు. కానీ బయటకు తప్పుగా వెళ్లింది` అని అన్నారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్రాజు. నాని హీరోగా నటించిన చిత్రం `శ్యామ్ సింగరాయ్`. రాహుల్ సాంక్రిత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో సక్సెస్ మీట్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్రాజు, నటుడు, దర్శక, నిర్మాత ఆర్ నారాయణమూర్తి పాల్గొన్నారు.
నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ, నాని వ్యాఖ్యలపై స్పందించారు. `శ్యామ్ సింగరాయ్` ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో నాని ఏపీ టికెట్లపై వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఏపీలో థియేటర్ కౌంటర్ కంటే పక్కన కిరాణా షాప్ కౌంటర్ ఎక్కువగా ఉందని, పది మందికి ఉపాధినిచ్చే థియేటర్లలో టికెట్ల రేట్లు తగ్గించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నాని వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు స్పందించి విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో దిల్రాజు మాట్లాడుతూ, నాని వ్యాఖ్యలను తప్పుగా తీసుకున్నారు. హీరోగా తను రెండేళ్లు అవుతుంది థియేటర్కి రాక. థియేటర్కి రాకుండా అడ్డుకున్న మొదటి సినిమా నాదే. `వి` చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నప్పుడు నేను, నాని చాలా స్ట్రగుల్ పడ్డాం. థియేటర్కే వెళ్దామన్నప్పుడు కరోనా కారణంగా పరిస్థితులు బాగాలేవు. ఆడియెన్స్ థియేటర్కి రాని పరిస్థితి ఉంది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా మనం కూడా స్టెప్పు వేయాలని చెప్పి `వి` చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశాం. నాని నెక్ట్స్ సినిమా కూడా ఓటీటీకి వెళ్లాల్సి వచ్చింది. దీనిపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా స్పందించారు. రెండు సినిమాల తర్వాత మూడో సినిమా థియేటర్కి వెళ్తున్నప్పుడు యాక్టర్గా ఆయనలో ఓ ఎమోషన్, పెయిన్ ఉంటుంది.
హీరోగా తన కష్టపడే తత్వానికి ఇటీవల ప్రెస్మీట్లో రియాక్ట్ అయ్యారు. తను చెప్పిన ఫీలింగ్ వేరు, కమ్యూనికేట్ అయిన ఫీలింగ్ వేరు. మీడియానే దానికి కారణం. హెడ్ లైన్స్ వల్లే మిస్ కమ్యూనికేట్ అవుతుంది. నాని విషయంలోనూ హెడ్ లైన్స్ వల్లే ఏదో అనేశారని కమ్యూనికేట్ అయ్యింది. లోపల ఏం రాశారనేది ఎవరూ చదవరు, అంత టైమ్ కూడా ఉండదు. టైటిల్ చూసి నాని ఏదో అన్నాడనే విషయం అందరికి వెళ్లింది. మాకు, ఆడియెన్స్ మధ్య గొడ మీడియా. వాళ్లు ఏది చూపిస్తే అదే బయటి వారికి చేరుతుంది. ఇక్కడ మాట్లాడాలంటే ఏంతో ఆలోచించి మాట్లాడతాం. ఎమోషనల్గా ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నామో తెలియదు. దాన్ని బ్యాలెన్స్ చేయాలి. నాని ఆ రోజు పెయిన్తో మాట్లాడారు. అంతేకాని నెగటివ్గా మాట్లాడలేదు. ఎవరూ ఆయన్ని అలా తప్పుగా అర్థం చేసుకోకూడదని కోరుకుంటున్నా` అని తెలిపారు దిల్రాజ్.
`శ్యామ్సింగరాయ్` చిత్రాన్ని నాని తన భుజాలపై వేసుకుని జనంలోకి తీసుకెళ్లాడని, ప్రారంభం నుంచి ఆయనే బాధ్యత తీసుకున్నారని, దీంతో నాని పెయిన్లో ఉన్నారని, ఆ పెయిన్ కారణంగానే ఎమోషనల్గా మాట్లాడారని, అంతేకాని ఎవరో విమర్శించే ఉద్దేశం కాదని చెప్పారు దిల్రాజు. ఈ నెలలో వరుసగా `అఖండ`, `పుష్ప`, `శ్యామ్సింగరాయ్` చిత్రాలు విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. డిస్ట్రిబ్యూటర్గా చాలా ఆనందంగా ఉన్నట్టు తెలిపారు. తమ కెరీర్లో ఎన్నో పరాజయాలు ఎదుర్కోవల్సి వస్తుందని, సక్సెస్ కంటే ఫెయిల్యూర్ శాతమే ఎక్కువగా ఉంటుందన్నారు. వాటన్నింటిని సినిమాపై ప్యాషన్తో భరిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు.