చిత్ర పరిశ్రమలో కంటెంట్ పరంగా చాలా మార్పులు వచ్చాయని చెప్పారు నిర్మాత బన్నీవాసు. ఓటీటీ వచ్చాక కంటెంట్ అద్భుతం అనేలా ఉండాలన్నారు.
ఓటీటీ వచ్చాక క్వాలిటీ కంటెంట్ ఉన్న సినిమాలకు డిమాండ్ పెరిగింది. మామూలు సినిమాలు చేస్తే చూసేప్రసక్తి లేదు. సినిమా థియేటర్లో ఆడాలంటే ఎక్స్ ట్రార్డినరీ కంటెంట్ ఉండాలి. నార్మల్, ఆర్డినరీ కంటెంట్తో సినిమాలు చేయలేమని అంటున్నారు నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu). అల్లు అరవింద్ స్థాపించిన గీతా ఆర్ట్స్ కి సబ్ బ్యానర్ అయిన జీఏ2కి అధినేత బన్నీవాసు. ఇటీవల వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నుంచి `పక్కా కమర్షియల్`(Pakka Commercial)చిత్రం రాబోతుంది. గోపీచంద్, రాశీఖన్నా జంటగా నటించారు. మారుతి దర్శకుడు. ఈచిత్రం జులై 1న విడుదల కానుంది.
నేడు శనివారం(జులై 11)న బన్నీవాసు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా ఇండస్ట్రీలోని మార్పులు, ఆయన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రాముడు మంచి బాలుడు అని చెబితే వినేవారు(ఆడియెన్స్) సిద్ధంగా లేరని తెలిపారు. రాముడు బెత్తం పట్టుకుని కొడతాడంటేనే క్రేజీగా ఉందని చూస్తున్నారు. సినిమా కథల్లో ఫార్మాట్ చాలా మారిపోయిందన్నారు. మొత్తానికి సినిమానే బాగానే ఒంటబట్టించుకున్నారు.
ఆయన చెబుతూ, `కరోనా కారణంగా మూడు సంవత్సరాల నుంచి చాలా సినిమాలు ఆగిపోయాయి. అవన్నీ ఇప్పుడు విడుదలవుతున్నాయి. దాంతో చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలకు టైం దొరకలేదు. ఈ మధ్య అవి కూడా వరుసగా వస్తుండడంతో.. ఇక సినిమాలు గ్యాప్ లేకుండా రిలీజ్ చేస్తాను. జులై 1న `పక్కా కమర్షియల్` సినిమా వస్తుంది. ఇది 100% ఎంటర్టైనర్. గోపి చంద్ గారు యాక్షన్ హీరో అయినా కూడా మారుతి ఈ సినిమాను నవ్వించేలా తెరకెక్కించాడు.
సెప్టెంబర్ 10న నిఖిల్ హీరోగా వస్తున్న `18 పేజెస్` విడుదల చేస్తాము. దసరా సీజన్ లో సెప్టెంబర్ 30న కిరణ్ అబ్బవరంతో చేస్తున్న `వినరో భాగ్యము విష్ణు కథ` విడుదల చేస్తాను. అలాగే ఆగస్టులో అల్లు శిరీష్ సినిమా ఉంది. అది కూడా విడుదల చేస్తాను. కంటిన్యూగా ఈ మూడు నాలుగు నెలలు గీతా ఆర్ట్స్ 2 నుంచి సినిమాలు వస్తూనే ఉంటాయి.
ఓటిటి గురించి కూడా నేను చాలా క్లారిటీగా ఉన్నాను. నా సినిమాలేవీ కనీసం 35 రోజులు వ్యవధి లేకుండా ఓటిటికి ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో ఆ టైం గ్యాప్ ఇంక పెంచాలని చూస్తున్నాను కానీ తగ్గించాలని కాదు. మా బ్యానర్ నుంచి వచ్చేవన్నీ ఎంటర్టైనింగ్ సినిమాలు. వాటిని థియేటర్లో చూసినప్పుడే మజా వస్తుంది. థియేటర్లో బాగా నవ్వించిన సినిమాలు కూడా ఓటిటిలో ఫ్లాప్ అవుతుంటాయి. ఎందుకంటే కేవలం థియేటర్లోనే చూసే సినిమాలు కొన్ని ఉంటాయి.
ఇక టికెట్ల విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ను బట్టి రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. నేను ఎంత సంపాదించాను అని కాకుండా ఆడియెన్స్ ను థియేటర్ కి ఎంత దగ్గరగా ఉంచాం అనేది ఇంపార్టెంట్. అందుకే `పక్కా కమర్షియల్` సినిమాని కూడా అందరికి అందుబాటులో ఉండే టికెట్ రేట్స్ పెట్టాం. కామన్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ సినిమాకి వచ్చే పాజిబిలిటే ఉన్నట్లే ప్లాన్ చేసాము.
2002 లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. నిర్మాతగా 2011 లో నా మొదటి సినిమా చేసాను. థియేటర్ లో ఆడటం కోసం ఎక్స్ట్రార్డనరీ కంటెంట్ తో సినిమా చేయాలి. నార్మల్ ,ఆర్డినరీ కంటెంట్ తో సినిమా చేయలేము` అని తెలిపారు బన్నీవాసు. డిస్టిబ్యూటర్గా కెరీర్ మొదలుపెట్టి 100% లవ్ సినిమాతో నిర్మాతగా మారి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేసిన బన్నీ వాసు ఇప్పుడు నిర్మించిన సినిమాలు విడుదలయ్యాక, కొత్తగా తమ బ్యానర్లో చందు మొండేటి , పవన్ సాధినేని సినిమాలు తీయబోతున్నట్టు తెలిపారు.
మరోవైపు బాలయ్యతోనూ ఓ సినిమాని ప్రకటించారు బన్నీవాసు. గీతా ఆర్ట్స్ లో బాలయ్యతో ఓ భారీ సినిమాకి ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే అది ఉండబోతుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని తెలిపారు. అల్లు అరవింద్ నిర్వహకులుగా ఉన్న `ఆహా` ఓటీటీలో బాలకృష్ణ `అన్స్టాపబుల్` టాక్ షో చేసిన విషయం తెలిసిందే. ఇది విశేషంగా ఆదరణ పొందింది. బాలయ్యలోని కొత్త యాంగిల్ని పరిచయంచేసింది. మోస్ట్ సక్సెస్ఫుల్ టాక్ షోగా నిలిచింది.
