దేశం కోసం ప్రాణాలు అడ్డుగా పెట్టి పోరాడుతున్న సైనికులరక్షణ కోసం ఎంతో మంది విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాగా బాలీవుడ్ సీనియర్ హిరోయిన్ ప్రీతి జింటా కూడా ఆర్మీ కోసం భారీ విరాళం ప్రకటించింది.
ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ (PBKS) సహ యజమాని, సినీ నటి ప్రీతి జింటా సైనిక కుటుంబాల పట్ల తన బాధ్యతను చాటుకున్నారు. ఆమె సౌత్ వెస్ట్రన్ కమాండ్లోని ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (AWWA)కి రూ. 1.10 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ విరాళాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)లో భాగంగా అందజేశారు.
ప్రీతి ఈ విరాళాన్ని జైపూర్లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అందించారు. ఈ ఈవెంట్లో సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ కమాండర్, ప్రాంతీయ అధ్యక్షుడు శప్త శక్తి, ఇతర ఆర్మీ కుటుంబాలు హాజరయ్యారు. విరాళం మొత్తాన్ని సైనిక వితంతువుల సాధికారత కోసం, అలాగే వారి పిల్లల విద్య కోసం వినియోగించనున్నట్లు తెలిపింది.
ఈ సందర్భంగా ప్రీతి జింటా మాట్లాడుతూ, "మన సాయుధ దళాల ధైర్యవంతులైన కుటుంబాలకు ఎంతో కొంత సాయం చేయడం గౌరవం, బాధ్యత కూడా. మన సైనికులు చేసిన త్యాగాలను తిరిగి చెల్లించలేం. కానీ వారి కుటుంబాలకు మద్దతుగా నిలిచి, వారు ముందుకు సాగేందుకు అండగా ఉండవచ్చు" అని అన్నారు.
ఆమె ఇంకా పేర్కొంటూ, "భారతదేశ సాయుధ దళాల పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది. మన దేశం, మన ధైర్యవంతులైన దళాలకు మద్దతుగా మేము ఎల్లప్పుడూ నిలబడతాం" అని తెలిపారు.
ఈ విరాళం సైనిక వితంతువుల సంక్షేమానికి, వారి పిల్లల విద్యాభివృద్ధికి ఉపయోగపడనుందని AWWA ప్రతినిధులు తెలిపారు. ప్రీతి జింటా చేసిన ఈ సహాయానికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది .ప్రీతి జింటా ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు.