రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) సంస్మరణ సభ  నేడు  ఏపీలోని మొగల్తూరులో భారీ ఏర్పాట్లతో జరుగుతోంది. ఈ  సందర్భంగా ప్రభాస్ కూడా అక్కడికి చేరుకున్నారు. అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. 

రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు (UV Krishnam Raju) ఈనెల 11న (సెప్టెంబర్ 11న) తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు, సన్నిహితులు వేలాదిగా తరలివచ్చిన విషయం తెలిసిందే. మరుసటి రోజు మొయినాబాద్ లోని కనకమామిడి ఫౌం హౌజ్ లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిసిన విషయం తెలిసిందే. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈరోజు కృష్ణంరాజు సంస్మరణ సభ (Krishnam Raju Memorial Service)ను పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ‘సలార్’ చిత్ర షూటింగ్ ను నిలిపేసి స్వస్థలం మొగల్తూరుకు చేరుకున్నారు. భారీగా ఏర్పాట్లను దగ్గరుండి మరీ చేయిస్తున్నారు. మరోవైపు అభిమానులు కూడా ఏర్పాట్లలో భాగస్వామ్యులయ్యారు. అంతేకాకుండా కృష్ణంరాజు, ప్రభాస్ అభిమానులు లక్ష వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే కృష్ణంరాజు ఇంటికి తెల్లవారుజామున రెండు, మూడింటి నుంచే చేరుకుంటున్నారు. 

భారీగా తరలివస్తున్న అభిమానులు తప్పనిసరిగా భోజనం చేసే వెళ్లాలని ఇప్పటికే ప్రభాస్ కోరినట్టు తెలుస్తోంది. మొగల్తూరులోని 10 ఎకరాల మామిడి తోటలో భోజన ఏర్పాటు చేస్తున్నారు. 70వేల మందికి సరిపడా వెజ్, నాన్-వెజ్ వంటకాలను వండించారు. మరోవైపు కృష్ణంరాజు అభిమానుల కోసం ఆయన హిట్ చిత్రాలను ప్రదర్శించేందుకు కూడా స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అభిమానులు కూడా ఆయన చిత్రాల్లో డైలాగ్స్ లను ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శించారు. ఆయన యాదిలో భారీ కటౌట్స్ కూడా ఏర్పాటు చేయించారు. ఇక కృష్ణం రాజు సంస్మరణ సభకు మీడియా కు అనుమతి లేదని చెప్పారు. ఆ ప్రోగ్రాం ఫీడ్ (వీడియో, ఫోటోలు) వాళ్లే రికార్డ్ చేసి ఇవ్వనున్నట్టు ప్రకటించారు.