ప్రభాస్‌, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ ఇప్పటికే చిత్రీకరణ జరుపుకుంటోంది. కానీ అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు.

ప్రభాస్‌ ఫ్యాన్స్ మరోసారి ఆగ్రహానికి గురవుతున్నారు. అప్‌ డేట్‌ కోసం వాళ్లు మండిపడుతున్నారు. సైలెంట్‌గా షూటింగ్‌ చేస్తున్నా, ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించని మారుతి సినిమా పట్ల వాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి అప్‌ డేట్‌ ఇవ్వాలని ట్రోల్స్ చేస్తున్నారు. సినిమాని ప్రకటించాలని ట్విట్టర్‌ లో రచ్చ చేస్తున్నారు. దీంతో `#AnnouncePrabhasMaruthiFilm ` యాష్‌ ట్యాగ్‌ ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. 

మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రభాస్‌ గతేడాది ప్రకటించారు. ప్రెస్‌ మీట్లలో వెల్లడించారు. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఎప్పుడో షూటింగ్‌ ప్రారంభించారు. మీడియాకి లీక్‌ కానివ్వకుండా షూటింగ్‌ ప్రారంభించారు. ఇప్పటికే మూడో షెడ్యూల్‌ ప్రారంభమైంది. సినిమా కూడా సగానికి పైగానే కంప్లీట్‌ అయ్యిందట. సైలెంట్‌ చిత్రీకరణ చేస్తున్నారు కానీ అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం లేదు. దీనికి సంబంధించి ఎలాంటి అప్‌ డేట్‌ ఇవ్వడం లేదని డార్లింగ్‌ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికైనా ప్రకటించాలని వాళ్లు డిమాండ్‌ చేస్తున్నారు. #AnnouncePrabhasMaruthiFilm యాష్‌ ట్యాగ్‌ని ట్రోల్‌ చేస్తున్నారు. అటు మారుతిని, నిర్మాణ సంస్థని ట్రోల్‌ చేస్తున్నారు. మా అభిమాన హీరోని చూపించరా అంటూ గగ్గోలు పెడుతున్నారు. అయితే ఈ సినిమాలోని ఫస్ట్ లుక్‌ ఇచ్చేందుకు టీమ్‌రెడీ అయ్యిందట. ఈ రోజు(బుధవారం) అందుకోసం ప్రత్యేకంగా ప్రభాస్‌ని ఫోటో షూట్‌ కూడా చేశారట. దాదాపు రోజంగా ఈ ఫోటో షూట్‌జరిగింది. మారుతి సినిమాలోని ఆయన పాత్ర లుక్‌ రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఈ ఫోటో షూట్‌ చేసినట్టు సమాచారం. అంతేకాదు త్వరలోనే ఫస్ట్ లుక్‌ని విడుదల చేయాలని భావిస్తున్నారట. 

ఈ సినిమాలో హీరోయిన్లుగా నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్ నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకి `రాజా డీల‌క్స్` అనే పేరును పరిశీలిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాల బడ్జెట్‌లో కాకుండా చాలా లిమిటెడ్‌ బడ్జెట్‌లో ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ఫన్‌, కమర్షియల్‌, యాక్షన్‌ ఎలిమెంట్ల మేళవింపుతో ఉంటుందని, పాత ప్రభాస్‌ని చూస్తారని సమాచారం. మారుతి తన మార్కు వినోదాన్ని మేళవిస్తూనే సరికొత్తగా ప్రభాస్‌ని ప్రజెంట్‌ చేయబోతున్నారట. ఈ సినిమాని పీపులర్‌ మీడియాఫ్యాక్టరీ నిర్మిస్తుంది. 

ఇదిలా ఉంటే ప్రభాస్‌ ప్రస్తుతం మూడు భారీ పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. రామాయణం ఆధారంగా రూపొందుతున్న `ఆదిపురుష్‌`లో ప్రభాస్‌ రాముడిగా నటిస్తున్నారు. మరోవైపు `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో `సలార్‌` మూవీ చేస్తున్నారు. ఇందులో కార్మిక నాయకుడిగా ప్రభాస్‌ కనిపించబోతున్నట్టు సమాచారం. ఇది పూర్తి మాస్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కుతుంది. దీంతోపాటు నాగ్‌ అశ్విన్‌తో `ప్రాజెక్ట్ కే` చేస్తున్నారు. సూపర్‌ హీరో కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో యోధుడిగా ప్రభాస్‌ కనిపిస్తారని సమాచారం.