తెలుగు చిత్ర సీమలోని కష్టాలపై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ , సినీ రంగాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఇప్పటికే పవన్‌కు తనదైన శైలిలో కౌంటరిచ్చిన రచయిత, నటుడు  పోసాని కృష్ణమురళి.. మంగళవారం మరోసారి మీడియా ముందుకు వచ్చారు.

తెలుగు చిత్ర సీమలోని కష్టాలపై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ , సినీ రంగాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఇప్పటికే పవన్‌కు తనదైన శైలిలో కౌంటరిచ్చిన రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి.. మంగళవారం మరోసారి మీడియా ముందుకు వచ్చారు. పవన్ కల్యాణ్.. కేసీఆర్‌ను విమర్శించరని మండిపడ్డారు. రాజకీయాల్లో ఆరోపణలు చేయడంలో తప్పులేదని... ఆరోపణలు ఎవరైనా చేయొచ్చని ఆయన వెల్లడించారు. జగన్ గురించి పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్.. పవన్ కల్యాణ్‌ను బహిరంగంగా హెచ్చరించారని అప్పుడు పవన్ ఫ్యాన్స్ ఏం చేశారని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. జగన్ ఏమీ అనట్లేదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటూ మండిపడ్డారు.

నిన్న ప్రెస్‌మీట్ పెట్టాక పవన్ ఫ్యాన్స్ నుంచి మెసేజ్‌లు వస్తున్నాయని పోసాని ఆరోపించారు. నన్ను బూతులు తిడుతూ వందలాది మెసేజ్‌లు వచ్చాయని ఆయన తెలిపారు. తాను పవన్‌ని ప్రశ్నించానని.. గతంలో చిరంజీవిని కేశినేని నాని విమర్శిస్తే తాను ఖండించానని పోసాని గుర్తుచేశారు. ఆ రోజు చిరంజీవిని కేశినేని విమర్శిస్తే పవన్ కల్యాణ్ ఎక్కడున్నారని ఆయన మండిపడ్డారు. ఆ రోజు మాట్లాడితే తనకు చిరంజీవి డబ్బులు ఇచ్చారా అని పోసాని ధ్వజమెత్తారు.

పవన్ కల్యాణ్ ఒక సైకో అని.. సినిమా హీరోల ఫంక్షన్లకు నీ ఫ్యాన్స్‌ని పంపించి గొడవ చేయిస్తావంటూ పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఫంక్షన్‌లలో పవన్ కల్యాణ్ అంటూ నినాదాలు చేయిస్తావంటూ మండిపడ్డారు. తనను తిడుతూ మెసేజ్‌లు పెడితే భయపడతానా అంటూ పోసాని ఫైర్ అయ్యారు. ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు, బెదిరింపులకు తాను భయపడనని కృష్ణమురళీ స్పష్టం చేశారు. జగన్‌ను పవన్ అనరాని మాటలు అన్నారని.. ఆరోపణలు చాలామందిపై ఉంటాయని పోసాని స్పష్టం చేశారు. జగన్‌పై పవన్ వ్యక్తిగతంగా మాట్లాడారని.. పవన్‌పై పగ పెట్టుకునే ఆలోచన లేదని కృష్ణమురళీ పేర్కొన్నారు. తాను జగన్ అభిమానిని అందుకే రియాక్ట్ అయ్యానని పోసాని స్పష్టం చేశారు. తనను రోజు తిట్టించినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోనని ఆయన వెల్లడించారు. పార్టీ పెట్టిన వ్యక్తి ఇంట్లో వాళ్ల గురించి అసభ్యంగా మాట్లాడతారా అని పోసాని ప్రశ్నించారు.