పూజా హెగ్డే టాలీవుడ్‌ కెరీర్‌ అయోమయ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఓ గుడ్‌ న్యూస్‌ వినిపిస్తుంది. ఆమె ఓ తెలుగు సినిమాకి కమిట్‌ అయ్యిందట. సాయితేజ్‌తో చేయబోతుందని టాక్.

పూజా హెగ్డే.. తెలుగు సినిమాల కెరీర్‌ ఇటీవల అయోమయంగా మారింది. `గుంటూరు కారం` సినిమా కారణంగా ఆమె చాలా ఆఫర్లు వదిలేసుకుంది. చివరికి అది కూడా పోయింది. దీని కారణంగా ఆమె కాల్షీట్లని గందరగోళంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బుట్టబొమ్మ కొత్త సినిమాకి కమిట్‌ అయినట్టు తెలుస్తుంది. మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పిందట. 

సంపత్‌ నంది దర్శకత్వంలో సాయితేజ్‌ ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్‌గా పూజాని ఫైనల్‌ చేసినట్టు సమాచారం. అయితే ఈ సినిమాకి కూడా శ్రీలీల, పూజాలను కన్సిడర్‌ చేసింది యూనిట్‌. ఇద్దరితోనూ చర్చలు జరిపారు. దీంతో పూజాకి శ్రీలీల మళ్లీ పోటీ కాబోతుందనే కామెంట్స్ వినిపించాయి. కానీ ఎట్టకేలకు పూజానే కన్ఫమ్‌ అయినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. 

ఇదిలా ఉంటే పూజా.. పవన్‌ కళ్యాణ్‌తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రంలో నటించాల్సి ఉంది. హరీష్‌ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా ఫైనల్ అంటూ దర్శకుడు గతంలో ఓ వేదికపై చెప్పారు. కానీ ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. కాల్షీట్ల నేపథ్యంలో ఈ అమ్మడు దూరమైనట్టు తెలుస్తుంది. మరోవైపు టీమ్‌ పూజాని తప్పించారనే ప్రచారం కూడా ఉంది. కానీ ఇప్పుడు సాయితేజ్‌తో సంపత్‌ నంది సినిమా ఓకే అయ్యిందనే వార్తతో.. పూజా మామ(పవన్‌)ని వదిలేసి అల్లుడి(సాయితేజ్‌)కి ఫిక్స్ అయ్యిందని సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. 

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ఓ ఆసక్తికర టైటిల్‌ వినిపిస్తుంది. `గంజా శంకర్‌` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. దాదాపు ఇది కన్ఫమ్‌ అని అంటున్నారు. మరోవైపు ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.