పేద కుటుంబాల కోసం రేషన్.. స్వయంగా ప్యాకింగ్ చేస్తూ పూజా హెగ్డే
పూజా హెగ్డే కరోనా అనుభవాల నుంచి చాలా నేర్చుకున్నట్టు కనిపిస్తుంది. తాజాగా ఈ అందాల భామ తనవంతుగా సాయం చేసేందుకు ముందుకొచ్చింది.
పూజా హెగ్డే కరోనా అనుభవాల నుంచి చాలా నేర్చుకున్నట్టు కనిపిస్తుంది. తాజాగా ఈ అందాల భామ తనవంతుగా సాయం చేసేందుకు ముందుకొచ్చింది. కోవిడ్ సంక్షోభం కారణంగా అనేక మంది పేదలు పూట గడవని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తనకు తోచిన సాయం చేస్తుంది పూజా. నిరుపేదలకు నెలకు సరిపడా సరుకులను అందించింది. వాటిని స్వయంగా తనే ప్యాక్ చేస్తున్న ఫోటోని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది పూజా. దాదాపు వంద పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించినట్టు సమాచారం.
పూజా చేసిన పని పట్ల ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల పూజా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో హోం ఐసోలేట్ అయ్యింది. కరోనా నుంచి విజయవంతంగా కోలుకుంది. ఆ తర్వాత కరోనా సోకిందని కంగారు పడకూడదని చెబుతూ, ఆక్సీమీటర్ను ఎలా వాడాలో తెలియజేసింది. ఇక ప్రస్తుతం పూజా తెలుగులో ప్రభాస్ సరసన `రాధేశ్యామ్`, అఖిల్ సరసన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్`, `ఆచార్య`, హిందీలో రణ్వీర్ సింగ్ సరసన `సర్కస్` సినిమాలో, సల్మాన్ఖాన్తో `కభీ ఈద్ కభీ దీవాలి` సినిమా చేస్తోంది. తమిళంలోనూ విజయ్ సరసన ఓ సినిమాకి కమిట్ అయ్యింది.