`పొన్నియిన్ సెల్వన్2` ట్రైలర్ డేట్.. ఫ్యాన్స్ కి శ్రీరామనవమి పండగ ట్రీట్
విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటించిన `పొన్నియిన్ సెల్వన్ 2` చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ని ప్రకటించింది యూనిట్.
దర్శకుడు మణిరత్నం నుంచి వచ్చిన అద్భుతమైన దృశ్య రూపం `పొన్నియిన్ సెల్వన్`. ఛోళసామ్రాజ్యం కథతో ముఖ్యంగా పొన్నియిన్ సెల్వన్ కథ ప్రధానంగా సాగే ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తమిళంలో మంచి కలెక్షన్లు వచ్చాయి. మిగిలిన భాషల్లో మిశ్రమ స్పందన రాబట్టుకుంది. ఇక ఈ చిత్రానికి పార్ట్ 2 ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ రెండో భాగం విడుదల కాబోతుంది. ఏప్రిల్ 28న `పొన్నియిన్ సెల్వన్ 2`(పీఎస్2) ని విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభించారు.
ఇప్పటికే విడుదలైన పాటలకు స్పందన బాగుంది. తాజాగా మరో అప్డేట్ ఇచ్చింది యూనిట్. ట్రైలర్ డేట్ని ప్రకటించారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా `పొన్నియిన్ సెల్వన్ 2` ట్రైలర్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది యూనిట్. ఈ నెల(మార్చి) 29న ట్రైలర్ని విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థ లైకా ప్రకటించింది. ఈమేరకు విక్రమ్ పాత్ర(ఆదిత్య కరికాలన్)తో కూడిన పోస్టర్ని విడుదల చేశారు.
ఇందులో చెబుతూ, `వారి కళ్లల్లో మంట, వారి హృదయాలలో ప్రేమ, వారి కత్తులపై రక్తం, చోళులు సింహాసనం కోసం పోరాడటానికి తిరిగి వస్తారు` అని వెల్లడించారు. చోళ సామ్రాజ్యంపై కుట్ర జరుగుతున్న నేపథ్యంలో దాన్ని తిరిగి దక్కించుకునే తిరిగి పోరాటం చేయడం నేపథ్యంలో రెండో భాగం సాగుతుందని తెలుస్తుంది.
ఇక ఇందులో విక్రమ్, కార్తి, జయం రవి, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య రాయ్, త్రిష ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిరత్నం రూపొందించిన ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. రెహ్మాన్ సంగీతం అందించారు. ఇటీవలే కార్తీ, త్రిష మధ్య సాగే ఆగనందే పాటను విడుదల చేయగా.. మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేస్తున్నారు. మొదటి భాగం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మరి రెండో భాగమైనా విజయం సాధిస్తుందో చూడాలి.