వాణీ జయరాం మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.. బంధువులు స్పందించకపోవడంపై ఆరా?
గాయని వాణీజయరాం మరణం ఓ వైపు అభిమానులను కన్నీటి సంద్రంగా మార్చగా, మరోవైపు అనేక అనుమానాలకు తావిస్తుంది. వాణి జయరాం మృతిని పోలీసులు అనుమానస్పద మృతి కేసుగా నమోదు చేశారు.

నేపథ్య గాయని వాణీజయరాం మరణం పెద్ద మిస్టరీగా మారుతుంది. ఆమె ఎలా చనిపోయిందనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఆమె మరణం ఓ వైపు అభిమానులను కన్నీటి సంద్రంగా మార్చగా, మరోవైపు అనేక అనుమానాలకు తావిస్తుంది. వాణి జయరాం మృతిని పోలీసులు అనుమానస్పద మృతి కేసుగా నమోదు చేశారు. ఆమె ఈ రోజు ఉదయం పది, పదకొండు గంటల మధ్యలో తన ఇంట్లో గాయాలతో పడి ఉన్న విషయం తెలిసిందే. ఇంట్లో పనిచేసే పనిమనిషి ఇది గమనించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె కన్నుమూసినట్టు వైద్యులు నిర్థారించారు.
అయితే ఆమె ఎలా చనిపోయిందనేదానిపై పోలీసులు విచారిస్తున్నారు. థౌజండ్ లైట్స్ పోలీస్ స్టేషన్కి చెందిన పోలీసులు వాణి మరణంపై ఐపీసీ సెక్షన్ 174కింద కేసు నమోదు చేశారు. అందులో భాగంగా ఇప్పటికే ఇంటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. గత నెల(జనవరి) 26 నుంచి వాణి ఇంట్లో ఇంటరిగానే ఉంటున్నట్టు గుర్తించారు. మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు ఇంట్లో ఆధారాలు సేకరిస్తున్నారు. చివరగా వాణీ ఎవరితో మాట్లాడారు, ఎవరెవరు వచ్చిపోయారు అనేది ఆరా తీస్తున్నారు. మరోవైపు వాణీ జయరాం మరణించినా, ఆమె తరపున బంధువులు ఎవరూ ఇప్పటి వరకు రియాక్ట్ కాకపోవడం కూడా పలు కొత్త అనుమానాలను రేకెత్తిస్తుంది.
ప్రస్తుతం వాణీ జయరాం భౌతిక కాయాన్ని చెన్నైలోని ఒమేదురార్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం ఆమె మరణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా కొడితే తగిలిన గాయాలా? ప్రమాదవశాత్తు కిందపడిపోవడం వల్ల తగిలిన గాయాలా? అనేదానిపై క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు గాయని మరణంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. అయితే వాణి జయరాం భౌతికకాయానికి పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆమె డెడ్ బాడీని తన అపార్ట్ మెంట్ వద్దకి తీసుకు వస్తారని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే గాయని వాణీ జయరాం మరణంపై ఆమె ఇంటి పనిమనిషి స్పందించిన విషయం తెలిసిందే. మీడియాతో ఆమె మాట్లాడుతూ, `నేను పదేళ్లుగా వాణీ జయరాం ఇంటి పనిమనిషిగా వర్క్ చేస్తున్నాను. ఆమె ఇంట్లో చాలా కాలంగా ఒంటరిగానే ఉంటుంది. ఎప్పటిలాగే తాను ఈ రోజు(శనివారం) ఉదయం 10.45గంటల సమయంలో ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాను. ఐదుసార్లు కొట్టినా డోర్ తెరవలేదు. ఫోన్ కూడా చేశా, అయినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో నా భర్తకి సమాచారం అందించాను.
కాలింగ్ బెల్ కొట్టినా డోర్ తీయకపోవడం, కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి కింద ఉన్న వారందరికి విషయం చెప్పాను. అందరం కలిసి పోలీసులకు సమాచారం అందించాం. పద్మ అవార్డులు ప్రకటించినప్పట్నుంచి ఆమెకి అభినందనలు చెబుతూనే ఉన్నారు. వాణీగారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎలాంటి ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం లేదు. కానీ ఒక్కసారిగా ఆమె నుదుటిపై గాయాలతో కనిపించడం షాక్ అయ్యాం` అని వెల్లడించారు. ప్రస్తుతం వాణి జయరాం భౌతిక కాయాన్ని పోలీసులు ఎగ్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.