Asianet News TeluguAsianet News Telugu

`పిండం` కథకి మూలం అక్కడే ఉంది.. షాకిచ్చిన డైరెక్టర్‌.. నల్గొండలో ఏం జరిగింది?

Pindam చిత్ర ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు సాయి కిరణ్‌ దైదా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నల్గొండ జిల్లాలో రియల్‌ గా జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా ఈ మూవీని రూపొందించినట్టు చెప్పారు.  

pindam director interesting things revealed about pindam movie arj
Author
First Published Dec 9, 2023, 11:51 PM IST

ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన హర్రర్‌ సినిమాలు ఓ ఎత్తు అయితే, తాను రూపొందించిన `పిండం` మూవీ మరో ఎత్తు అంటున్నారు దర్శకుడు సాయి కిరణ్‌ దైదా. ఆయన దర్శకుడిగా పరిచయం అవుతూ `పిండం` చిత్రాన్ని రూపొందించారు. శ్రీరామ్‌, ఖుషి రవి జంటగా నటించారు. శ్రీనివాస్‌ అవసరాల కీలక పాత్రలో నటించారు. ఈ మూవీని కళాహి మీడియా పతాకంపై యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మించారు. ఈ నెల 15న సినిమా విడుదలకాబోతుంది. 

చిత్ర ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు సాయి కిరణ్‌ దైదా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నల్గొండ జిల్లాలో రియల్‌ గా జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా ఈ మూవీని రూపొందించినట్టు చెప్పారు. కథకి మూలం అక్కడే ఉందన్నారు. `నల్గొండ జిల్లాలో ఒక ఘటన జరిగింది. అది మా నాయనమ్మ చెప్పడం వల్ల నాకు బాగా గుర్తుండిపోయింది. దాని చుట్టూ కథ అల్లుకొని, ఎలాంటి సినిమా తీస్తే బాగుంటుందని ఆలోచించాను. దీనిని హారర్ జానర్ లో చెప్తే బాగుంటుంది అనే ఆలోచనతో పిండం సినిమా మొదలుపెట్టాను. యదార్థ ఘటన చుట్టూ కల్పిత కథ అల్లుకోవటం జరిగింది` అని, అయితే ఆ ఘటన గురించి ఇప్పుడే చెప్పలేనని, సినిమా చూశాక ఆ విషయం తెలిస్తుందన్నారు. ఆ ఘటన చుట్టూ అల్లుకున్న కల్పిత కాబట్టి  సినిమాలో మాత్రం మెదక్ జిల్లాలోని శుక్లాపేట్ లో జరిగినట్లుగా సినిమాలో చూపించామని తెలిపారు. 

`ప్రేక్షకులు హారర్ జానర్ సినిమాలు చూడటానికి వచ్చేది భయపడటం కోసమే. ఆ హారర్ అనుభూతిని కలిగించి, భయం ఇవ్వాలి. దానిని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ ని ఎంతో శ్రద్ధతో రాసుకోవడం జరిగింది. హారర్ సినిమా కాబట్టి ప్రేక్షకులను భయపెట్టే సన్నివేశాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. సినిమా మొత్తం పూర్తయ్యాక, సినిమా చూసుకొని విజయం పట్ల మరింత నమ్మకం కలిగింది. అప్పుడే 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనే ట్యాగ్ లైన్ పెట్టి ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాము` అని చెప్పారు. 

`పిండం` అంటే రెండు అర్థాలు ఉన్నాయి. కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు పిండాకారం అంటారు. అలాగే ఒక మనిషి చనిపోయాక పెట్టేది కూడా పిండం అనే అంటాం. అసలు అది ఏంటి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే కథలో కోర్ పాయింట్ అదే. నేను కథ రాసుకున్నప్పుడే `పిండం` టైటిల్ అనుకున్నాం. ఇలాంటి నెగటివ్ టైటిల్ ఎందుకు, అసలే ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ అని నా టీమ్ మెంబర్స్ కూడా పిండం టైటిల్ మార్చమన్నారు. అయితే ఒక మూఢ నమ్మకాన్ని పట్టుకొని, కథకి సరిగ్గా సరిపోయే టైటిల్ ని కాదని వేరే టైటిల్ పెట్టడం నాకు కరెక్ట్ కాదు అనిపించింద`న్నారు. 

`నాకు మూడు నాలుగు కాస్టింగ్ ఆప్షన్లు ఇచ్చారు. అందులో శ్రీరామ్ పేరు చూడగానే ఎగ్జైట్ అయ్యాను. ఆయన నటించిన ఎన్నో సినిమాలు చూసి ఉన్నాను. ఆయన ఎలా నటిస్తారో తెలుసు. ఈ పాత్రకి శ్రీరామ్  నూటికి నూరుశాతం సరిపోతారు. ఆయనలో ఒక వింటేజ్ లుక్ ఉంటుంది. 1990ల కథకి ఆయన బాగా సెట్ అవుతారు. టీజర్ కి, ట్రైలర్ కి రెండింటికీ మంచి స్పందన వచ్చింది. కేవలం టీజర్ తోనే మా సినిమా బిజినెస్ అయిపోయింది. ట్రైలర్ చూసి ఎందరో అభినందించారు. మీరు టీజర్, ట్రైలర్ లో చూసిన దానికంటే ఎన్నో రెట్ల కంటెంట్ సినిమాలో ఉంటుంది` అని చెప్పారు. 

షూటింగ్‌లో సంఘటనలు చెబుతూ, `ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి తగినంత సమయం కేటాయించి, పూర్తి క్లారిటీతోనే షూటింగ్ కి వెళ్ళాం. అందుకే ఛాలెంజింగ్ గా ఏం అనిపించలేదు. అయితే సెట్స్ లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా క్లైమాక్స్ చిత్రీకరించేటప్పుడు కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించింది. ఆరు రోజుల షెడ్యూల్ అది. ఈశ్వరి గారి తలకి గాయం కావడంతో పాటు కొన్ని ఘటనలు జరిగాయి. ఆ సమయంలో ఏంటి ఇలా జరుగుతుంది అని కాస్త భయం వేసింది. ఆ సమయంలో మరింత శ్రద్ధగా, బాధ్యతగా పని చేశామన్నారు. నెక్ట్స్ సినిమా గురించి చెబుతూ, `కృష్ణుడి లంక` అనే క్రైమ్ కామెడీ సినిమా చేయబోతున్నానని, హీరో పేరు కృష్ణ, అతను శ్రీలంకలో ఉంటాడు. ఎందుకు అక్కడ ఉంటున్నాడు? అతని సమస్య ఏంటి? అనేది కథ. ఇంకా హీరో ఎవరు అనేది అనుకోలేదు. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తానని తెలిపారు దర్శకుడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios