పవన్- రానా సినిమాః సినిమాటోగ్రాఫర్ ఛేంజ్..
పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మారారు. ప్రసాద్ మూరెళ్ల స్థానంలో ప్రముఖ కెమెరా మెన్ రవి కె చంద్రన్ని తీసుకున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.
పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇది మలయాళంలో సూపర్ హిట్ అయిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` చిత్రానికి రీమేక్. ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు, స్ర్కీన్ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ గ్లింప్స్ ని విడుదల చేయగా అది వైరల్ అయ్యింది. సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇందులో పవన్ భీమ్లా నాయక్ అనే ఎస్ఐగా కనిపించబోతున్నారు. ఆయన పాత్ర లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో రానా పాత్రని తక్కువగా చూపించారు. పాత్ర పేరు కూడా రివీల్ చేయలేదు. దీన్ని పవన్ సినిమాగా ప్రొజెక్ట్ చేయబోతున్నారా? అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో సినిమాటోగ్రాఫర్ మారినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రసాద్ మూరెళ్ల కెమెరా వర్క్ చేస్తుండగా, ఆయన స్థానంలో కొత్త సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ని తీసుకున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. హిందీ, తమిళం,మలయాళం వంటి భాషల్లో అనేక చిత్రాలకు పనిచేసిన రవి కె చంద్రన్ తెలుగులో మహేష్ బాబు హీరోగా రూపొందిన `భరత్ అనే నేను` సినిమాకి వర్క్ చేశారు. ఇది ఆయనకు రెండో చిత్రంగా చెప్పొచ్చు.
ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.