మొదట ఈ సినిమాలో రానా కమిట్‌ అయ్యారని, ఆ తర్వాతే పవన్‌ కళ్యాణ్‌ ప్రాజెక్ట్ లోకి వచ్చారని తెలిపారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ కంటే ముందు బాలకృష్ణ అనుకున్నారట. 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan), రానా దగ్గుబాటి(Rana) నటించిన `భీమ్లా నాయక్‌`(Bheemla Nayak) చిత్రం పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. యంగ్‌ డైరెక్టర్‌ సాగర్‌ కె చంద్ర(Sager K Chandra) దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ని తెచ్చుకుంది. సినిమా వీకెండ్‌ పూర్తి చేసుకుని నెక్ట్స్ వీక్‌లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో సినిమాని మరింతగా జనానికి చేర్చే ప్రయత్నం చేస్తుంది యూనిట్‌. ప్రమోషన్‌ కార్యక్రమాలు పెంచుతున్నారు. విడుదలకు ముందు జస్ట్ ఒక్క ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తోనే సరిపెట్టినా, ఇప్పుడు రెగ్యూలర్‌గా మీడియాలో, సోషల్‌ మీడియాలో నాన్చే ప్రయత్నం చేస్తున్నారు. 

అందులో భాగంగా ఇటీవల సక్సెస్‌ సెలబ్రేషన్‌ నిర్వహించారు. అంతేకాదు సక్సెస్‌ పార్టీ కూడా చేసుకున్నారు. తాజాగా సోమవారం దర్శకుడు సాగర్‌ కె చంద్ర మీడియాతో `భీమ్లా నాయక్‌` సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాకి కెప్టెన్‌ అయిన సాగర్‌ కె చంద్ర సినిమాని టేకప్‌ చేసిన తీరుని వివరించారు. చేసిన మార్పుల గురించి తెలిపారు. ఇది మలయాళంలో విజయవంతమైన `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌`కి రీమేక్‌ అనే విషయం తెలిసిందే. మాతృకని యదాతథంగా తీస్తే ఇక్కడ చూడరని, ఇక్కడికి సంబంధించిన ఎమోషన్స్, కమర్షియల్‌ అంశాలను మేళవించామన్నారు. ఇక్కడి ఆడియెన్స్ డిఫరెంట్‌ టేస్ట్‌ గల వారున్నారని, అందరికి నచ్చేలా తీయడం కోసం మార్పులు అనివార్యమన్నారు. మూడు లేయర్స్ లో ఆడియెన్స్ కి కావాల్సిన అంశాలను జోడించాలన్నారు.

రీమేక్‌ చేయాలనుకున్నప్పుడు పాజిటివ్‌ సైడ్‌ టర్న్ తీసుకోవాలని, భీమ్లా నాయక్‌ పాత్ర వైపు ఎక్కువ ఫోకస్‌ తీసుకున్నట్టు చెప్పారు దర్శకుడు సాగర్‌ కె చంద్ర. అయితే రానా పాత్రని ఏమాత్రం తక్కువ చేయలేదని, ఆయన తన పాత్రతో మరింత హైలైట్‌ అయ్యారని, ఇప్పుడు ఆయన పాత్రకే ఎక్కువగా ప్రశంసలు దక్కుతున్నాయని చెప్పారు సాగర్‌ కె చంద్ర. సినిమా షూటింగ్‌ కూడా డిఫరెంట్‌గా చేశామన్నారు. పవన్‌, రానాతోపాటు మెయిన్‌ కాస్టింగ్‌ మధ్య రియల్‌ ఎమోషన్స్ క్రియేట్‌ చేశామన్నారు. వారి మధ్య ఘర్షణ సహజంగా క్రియేట్‌ చేసి వారి ఎమోషన్‌ని కెమెరాలో బంధించారట. అందుకోసం కెమెరా ట్రిక్కులను వాడినట్టు తెలిపారు. 

అయితే మొదట ఈ సినిమాలో రానా కమిట్‌ అయ్యారని, ఆ తర్వాతే పవన్‌ కళ్యాణ్‌ ప్రాజెక్ట్ లోకి వచ్చారని తెలిపారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ కంటే ముందు బాలకృష్ణ అనుకున్నారట. సినిమా రీమేక్‌ అనుకున్నప్పుడు బాలకృష్ణ అయితే బాగుంటుందనే చర్చ వారి మధ్య జరిగిందట. అయితే అది కేవలం ప్రారంభ చర్చ మాత్రమే అని, బాలయ్య దగ్గరికి వెళ్లలేదని తెలిపారు దర్శకుడు సాగర్‌ కె చంద్ర. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ ప్రాజెక్ట్ లోకి వచ్చారని చెప్పారు. అయితే ఈ రీమేక్‌ రైట్స్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తీసుకున్నప్పుడు బాలకృష్ణ, రానా కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు మీడియాలో వచ్చాయి. ఆ వార్తలు నిజమే అనే విషయం ఇప్పుడు తేలిపోయింది. పవన్‌ కళ్యాణ్‌ని మొదటి సారి కలిసినప్పుడు తనకి అభినందనలు తెలిపి బాగా చేయు అని తెలిపారట. 

`భీమ్లా నాయక్‌` సినిమా ఫలితం విషయంలో తాను హ్యాపీగానే ఉన్నట్టు చెప్పారు. తనకు వచ్చిన పేరు ఏదైనా అది గిఫ్టే అని పేర్కొన్నారు. దర్శక విభాగంలో తనది, త్రివిక్రమ్‌ ఎవరి పార్ట్ వారిది సెపరేట్‌ అని వెల్లడించారు. త్రివిక్రమ్‌ గారు చాలా సపోర్ట్ చేశారని, పాండమిక్‌ టైమ్‌లో ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నారన్నారు. టికెట్ల రేట్లు, ప్రభుత్వాల ఇబ్బందులు, ఐటీ రైడ్స్ లాంటివి బయటి నుంచి వచ్చే ఇప్పుడు ఎప్పుడూ ఉంటాయన్నారు. వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగాలని చెప్పారు. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్‌ కాలేదని దాని గురించి త్వరలో చెబుతానన్నారు సాగర్‌ కె చంద్ర. మొత్తంగా `భీమ్లా నాయక్‌`తో టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్స్ జాబితాలో చేరిపోయారు సాగర్‌ కె చంద్ర.