పూట గడవని దుర్బర జీవితం, కీరవాణి సంపాదనే ఆధారం... రాజమౌళి ఫ్యామిలీ అంత పేదరికం అనుభవించిందా?
రాజమౌళి-కీరవాణి టాలీవుడ్ ప్రైడ్ గా అవతరించారు. ఇండియాకు ఆస్కార్ తెచ్చారు. అయితే వీరు బాల్యంలో కడు పేదరికం అనుభవించారట.
కీరవాణి తండ్రి శివశక్తి దత్త ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఒకప్పటి తమ కుటుంబ పరిస్థితులు గుర్తు చేసుకున్నారు. సినిమా కోసం పెద్ద మొత్తంలో ఆస్తులు కోల్పోవడంతో పాటు కడు పేదరికం అనుభవించినట్లు వెల్లడించారు. శివశక్తి దత్త మాట్లాడుతూ... మేము నలుగురం అన్నదమ్ములం. తుంగభద్ర తీరానికి వలస వెళ్ళాం. 16 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉన్నాము. అక్కడ నేను 300 ఎకరాల పొలం కొన్నాను. మొదటి నుండి సినిమా అంటే పిచ్చి. సినిమాల కోసం పొలం మొత్తం పోగొట్టుకున్నాం.
చివరికి మా పరిస్థితి పూట గడవటం కష్టం అన్నట్లు తయారైంది. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి దగ్గర పనిచేసేవాడు. కీరవాణి సంపాదనే మమ్మల్ని బ్రతికించింది. కీరవాణి ప్రతిభ కలవాడు. చిన్నప్పటి నుండి అతనికి మ్యూజిక్ నేర్పించాను. నేను తమ్ముడు విజయేంద్ర ప్రసాద్ కలిసి కథారచయితలుగా పని చేశాము. జానకిరాముడు, కొండవీటి సింహం వంటి హిట్ చిత్రాలకు కథలు అందించాము... అని చెప్పుకొచ్చారు.
అలాంటి కుటుంబంలో పుట్టిన రాజమౌళి, కీరవాణి ఆస్కార్ స్థాయికి వెళ్లారు. రాజమౌళికి కీరవాణి ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉన్నారు. ఆయన మొదటి చిత్రం నుండి ఇప్పటి వరకు కీరవాణి మ్యూజిక్ ఇచ్చారు. చెప్పాలంటే ఈ కుటుంబంలో అందరూ ఆర్టిస్టులే. రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్, కొడుకు కార్తికేయ ప్రొడక్షన్ డిజైనర్. కీరవాణి ఇద్దరు కొడుకుల్లో ఒకరు నటుడు కాగా మరొకరు మ్యూజిక్ డైరెక్టర్. రాజమౌళి టీమ్ లో సగం మంది కుటుంబ సభ్యులు ఉంటారు.
దర్శకుడు రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇప్పుడు గ్లోబల్ పర్సనాలిటీస్. వెరీ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి ఎంపిక కాగా సంగీతం, సాహిత్యం సమకూర్చిన కీరవాణి, చంద్రబోస్ వేదిక పైకి వెళ్లి ఆస్కార్ అందుకున్నారు. ఈ ఆస్కార్ గెలుచుకోవడం వెనుక సమిష్టి కృషి ఉంది.