'సైరా' గురించి షాకింగ్ విషయం రివీల్ చేసిన సురేంద్రరెడ్డి!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 2న సౌత్ ఇండియన్ అన్ని భాషలు, హిందీలో భారీ ఎత్తున రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాలు జోరందుకుంటున్నాయి.
చరిత్ర మరచిపోయిన వీరుడి కథను `సైరా నరసింహారెడ్డి`గా వెండితెరపై ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 2న విడుదల కాబోతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు సురేంద్రరెడ్డి ఓ షాకింగ్ విషయం రివీల్ చేసారు.
అదేమిటంటే సైరాలో కేవలం రెండే పాటలు ఉన్నాయట. ఈ సినిమాలో పాటలు స్కోప్ లేదని, పాటలను ఇరికించటం ఇష్టంలేకపెట్టలేదట. ఈ విషయాన్ని సురేంద్రరెడ్డే చెప్పారు. ఆయన మాట్లాడుతూ.... సినిమాలో రెండు పాటలే ఉన్నాయి. బ్యాగ్రౌండ్లో వచ్చే మరో పాట ఉంటుంది. పాటలన్నీ సీతారామశాస్త్రే రాశారు అని చెప్పారు.
అలాగే మొదట రెహమాన్ అనుకుని ఆ తర్వాత ఆయన స్థానంలో అమిత్ త్రివేదిని సంగీత దర్శకుడిగా ఎంచుకోవడం.. బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం జూలియస్ పేకియమ్ను తీసుకోవడం.. విషయాలపైనా సురేందర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.
సురేంద్రరెడ్డి మాట్లాడుతూ...‘‘ముందు సైరా కోసం సంగీత దర్శకుడిగా ఏ.ఆర్. రెహమాన్నే అనుకున్నాం. కానీ ఆయన చాలా బిజీ. టైమింగ్స్, డేట్స్ అడ్జస్ట్ కాలేదు. ఒక పాట అర్జెంటుగా షూటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. భారీ సెట్ వేశాం. వేలాదిమంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చాం. రెహమాన్గారితో అయితే ఆలస్యమవుతుందనిపించింది.
దీంతో సంగీత దర్శకుడిని మార్చాల్సి వచ్చింది. తన బిజీ షెడ్యూల్ వల్ల మేం ఆయనతో చేయలేకపోయాం. ఆ తర్వాత రామ్చరణ్, నేనూ కలిసి అమిత్ త్రివేదిని తీసుకుందామని అనుకున్నాం. తర్వాత చిరంజీవి గారి దగ్గరికెళ్లాం. మీరు కాన్ఫిడెంట్గా ఉంటే గో ఎహెడ్ అన్నారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అమిత్ త్రివేదినే చేయాలి.
ఆయన ఆరేడు నెలల సమయం అడిగాడు. అప్పటికి మా చేతిలో ఉన్నది మూడు నెలలే. అందుకే జూలియస్ పేకియమ్ను సంప్రదించాం. తన నేపథ్య సంగీతంతో జూలియస్ పేకియమ్ ‘సైరా’ను మరో స్థాయికి తీసుకెళ్లాడు’’ అని సురేందర్ తెలిపాడు.