ఒక దర్శకుడు దర్శకత్వం వహిస్తూ, సినిమాటోగ్రాఫర్ గా, ఎడిటర్‌గా, కొరియోగ్రాఫర్‌గా సాంగ్‌ రైటర్‌గా పనిచేయోచ్చు. ఆర్ట్ వర్క్ చూసుకునే ఛాన్స్‌ ఉంది. కానీ 24 విభాగాలను డీల్‌ చేయడం సాధ్యమా?.. ఇప్పుడీ ప్రయోగం తెలుగులో చేయబోతున్నారు.

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా ఓ సినిమా రాబోతుంది. అందుకు తెలుగు చిత్ర పరిశ్రమ వేదిక కాబోతుంది. ఈ సంచలన చిత్రం తెలుగులో శనివారం ప్రారంభమైంది. ఈ సినిమాకి సింగర్‌ సునీత సపోర్ట్ చేయడం విశేషం. ఆ వివరాలు చూస్తే, ఈశ్వర్‌, సాయి విక్రాంత్‌, రిషి, సూర్య ప్రధాన పాత్రల్లో యస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యష్‌రాజ్‌ సమర్పణలో `నీకు నాకు రాసుంటే` పేరుతో ఓ చిత్రం రూపొందుతుంది. స్రవంతి పలగని, అభిషేక్‌ ఆవల నిర్మాతలు. 

ఈ చిత్రానికి కె.ఎస్‌ వర్మ దర్శకులు. కేవలం దర్శకులే కాదు, ఆయన 24 క్రాఫ్ట్ లను నిర్వహించబోతున్నారు. ఓ ప్రయోగాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రం సాంగ్‌ రికార్డింగ్‌, బ్యానర్‌ లాంచింగ్‌ హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్‌లో శనివారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. సింగర్‌ సునీత ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ, `తెలుగులో యశ్‌రాజ్‌ పేరుతో బ్యానర్‌ స్థాపించడంతోనే సగం విజయం సాధించారు నిర్మాతలు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం దర్శకులు వర్మ గారే 24 క్రాఫ్ట్స్ చేస్తున్నారు. ఈ ప్రయోగం ఒక మంచి ప్రయోగంగా మిగిలి పోవాలి. యూనిట్‌ అందరికీ నా బెస్ట్‌ విషెస్‌. నేను లైవ్‌లో ఓ సినిమాకు పాట పాడటం ఇదే తొలిసారి. ఇది కూడా ఓ రికార్డ్‌ అనుకుంటా. నాకు ఈ ప్రయోగాత్మక చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు`అని అన్నారు. 

దర్శకుడు కె.ఎస్‌. వర్మ మాట్లాడుతూ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో అన్ని భాషలకు చెందిన నటీనటులు పనిచేస్తున్నారు. ప్రపంచ రికార్డు కోసం 24 క్రాఫ్ట్స్ ను నేనే నిర్వహిస్తున్నాను. దీన్ని లైవ్‌ రికార్డు కూడా చేస్తాం. తప్పకుండా మా కష్టానికి తగ్గట్టుగా ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను. మా సినిమాలో జాతీయ అవార్డు పొందిన ఓ ప్రముఖ హీరోయిన్‌ ముఖ్యమైన పాత్రలో నటించనున్నారు.. ఇందుకు చర్చలు జరుగుతున్నాయి` అని చెప్పారు. 

నిర్మాతలు మాట్లాడుతూ, `భారత దేశం గర్వించే సినిమాలు చేసిన యశ్‌రాజ్‌ ఫిలింస్‌ని దృష్టిలో పెట్టుకుని మా బ్యానర్‌కు ఈ పేరు పెట్టాము. యష్‌ రాజ్‌ అనేది మా అబ్బాయి పేరు కూడా కావడం మాకు లక్కీ. 2020లోనే సినిమా చేద్దామని అనుకున్నాం. కానీ సరైన కథలు దొరకలేదు. మా దర్శకుడు వర్మ గారు చెప్పిన లైన్ నచ్చి ఈ సినిమా సెట్స్‌కు మీదకు తీసుకెళ్తున్నాం. స్టోరీ బలంగా ఉందన్న నమ్మకంతో కొత్త వారితో వెళుతున్నాం. టాలెంటెడ్‌ టెక్నీషియన్స్ ను ఎంచుకున్నాం అన్నారు. 

ఈ ఏడాది మూడు సినిమాలు నిర్మించాలనుకుంటున్నాం.. అన్ని సినిమాల్లో కొత్తవారికి అవకాశాలు ఇస్తాం. మే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి, హైదరాబాద్, అరకు, వైజాగ్, మంగళూరు, ఊటీ, చెన్నై తదితర లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతాం` అని అన్నారు. హీరోలు ఈశ్వర్, సాయివిక్రాంత్, రిషి, సూర్య మాట్లాడుతూ... మాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత స్రవంతి గారికి, దర్శకులు వర్మ గారికి ధన్యవాదాలు. గత 6 నెలలుగా యూనిట్‌తో ట్రావెల్‌ చేస్తున్నాం. మా డెరైక్టర్‌ గారు మల్టీటాలెంటెడ్‌ అవడం వల్ల మేము కొత్త అయినా ఆ ఫీలింగ్‌ కలగడం లేదు. తప్పకుండా మాకు మంచి కెరీర్‌ దొరుకుతుందని ఆశిస్తున్నాం` అని చెప్పారు. 

ఇతర తారాగణంః 
సత్యరాజ్, సుమన్, అలీ, రఘుబాబు, గౌతంరాజు, తనికెళ్ల భరణి, ఉత్తేజ్‌ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

టెక్నీషియన్స్‌ :
బ్యానర్‌: యష్‌ ఎంటర్‌టెన్మైంట్స్‌.
సమర్పణ: యష్‌రాజ్‌
నిర్మాతలు: స్రవంతి పలగాని, అభిషేక్‌ ఆవల
24 క్రాఫ్ట్స్, డెరైక్టర్‌ : కె.ఎస్‌. వర్మ.
మ్యూజిక్‌ ప్రోగ్రామర్‌: టి.ఆర్‌. కృష్ణ చేతన్ 
డి.ఓ.పి : హేమంత్‌ బి.ఎం.
యాక్షన్ : కనిష్క శర్మ షిఫు
ఆర్ట్‌ డెరైక్టర్‌ : నాని.
ఎడిటర్‌ : ఆంటోని.
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌ : సురేష్‌బాబు.
మేనేజర్‌ : మోహన్ కుమార్‌ ఎం, మోహన్ రాజ్‌
కో డెరైక్టర్స్‌: ఆర్‌.వి. సురేష్, పి. జగన్నాథ్‌రెడ్డి, కె.వీర.
పీఆర్‌ఓ: వడ్డె మారెన్న