నానిని టార్గెట్ చేయటం సరికాదు
కొందరు ఎగ్జిబిటర్స్ ఈ విషయాన్ని మరీ పర్సనల్గా తీసుకుని నానిని టార్గెట్ చేసారు.
నాగ చైతన్య హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ మూవీని ఆ చిత్ర నిర్మాతలు దాదాపు మూడు నెలలు పాటు వెయిట్ చేసి, సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. సరిగ్గా అదే రోజున నాని ‘టక్ జగదీశ్’ సైతం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. దాంతో వివాదం ప్రారంభమైంది. ‘థియేటర్లంటే ప్రాణమని, థియేటర్లలో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటంలోనే మజా ఉంటుంది’అని మొన్నటి వరకూ చెప్పిన నాని… ఇప్పుడు ఇలా యూ టర్న్ తీసుకుని తన సినిమాను ఓటీటీలో ప్రసారం చేయించడానికి అంగీకరించడంపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.
థియేట్రికల్ రిలీజ్ కోసం ‘లవ్ స్టోరీ’ని ఇన్ని నెలల పాటు హోల్డ్ చేసి, ఇప్పుడు రిస్క్ తీసుకుని విడుదల చేస్తుంటే, అదే రోజున నాని తన సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం ఎంతవరకూ భావ్యమని ఛాంబర్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఒక సినిమాను మరో సినిమా ఇలా కిల్ చేయడం ఎంతవరకూ సమంజసమని అడుగుతున్నారు.
కొందరు ఎగ్జిబిటర్స్ ఈ విషయాన్ని మరీ పర్సనల్గా తీసుకుని నానిని టార్గెట్ చేసారు. సినిమాల్లోనే నాని హీరో.. బయట జీరో.. పిరికివాడు అంటూ ఫైర్ అవుతున్నారు. థియేటర్లో కనిపించిన వాడినే హీరో అంటారు కానీ ఓటిటిలో కనిపించేవాడు కాదు హీరో అంటూ విమర్శలు చేస్తున్నారు. అప్పటికీ ‘టక్ జగదీశ్’ సినిమా విడుదలపై తుది నిర్ణయం నిర్మాతలదే అని నాని చెప్పినా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కన్వెన్స్ కావడం లేదు.
ఈ నేఫధ్యంలో తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ సునీల్ నారంగ్ మాట్లాడుతూ..నానిని టార్గెట్ చేయటం సరికాదన్నారు. సినిమా అనేది నిర్మాతకు సంభందించిన ప్రొడక్ట్ అని ,కాబట్టి నిర్మాతే తన సినిమాని ఎలా రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వస్తాడని చెప్పారు. హీరోలపై కోపం చూపటం పద్దతి కాదన్నారు. నిర్మాతలపై ఒత్తడి తేవాలన్నారు. అలాగే హీరోలు కూడా మన థియోటర్ సిస్టమ్ ని కాపాడుకోవాటనికి సపోర్ట్ చేయాలని కోరారు. మరి ‘టక్ జగదీశ్’ను థియేటర్లలోనే రిలీజ్ చేస్తారో, లేదంటే కనీసం కొంతకాలం ఆగి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయిస్తారో చూడాలి.