గ్రాండ్ గా నితిన్, రష్మిక మూవీ లాంచ్.. క్లాప్ కొట్టి ప్రారంభించిన మెగాస్టార్
నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా మరో క్రేజీ కాంబినేషన్ లో నితిన్ కొత్త చిత్రం ప్రారంభం అయింది.
యంగ్ హీరో నితిన్ కి ఈ ఏడాది పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాస్ చిత్రంతో హిట్ కొట్టాలన్న కసితో నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే చిత్రంలో నటించాడు. డెబ్యూ డైరెక్టర్ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో నితిన్ తన తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్త వహిస్తున్నాడు.
నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా మరో క్రేజీ కాంబినేషన్ లో నితిన్ కొత్త చిత్రం ప్రారంభం అయింది. రెండు రోజుల క్రితం నితిన్, రష్మిక, వెంకీ కుడుముల సూపర్ హిట్ కాంబినేషన్ లో రెండవ చిత్రాన్ని చాలా ఫన్నీగా అనౌన్స్ చేశారు. వారిపై వారే సెటైర్లు వేసుకుంటూ తమ సెకండ్ మూవీని ప్రకటించారు. భీష్మ చిత్రంతో ఈ ముగ్గురు కలసి మ్యాజిక్ చేసిన సంగతి తెలిసిందే.
హీరో నితిన్ కి ఇదే చివరి హిట్ చిత్రం. ఆ తర్వాత నటించిన చిత్రాలు నిరాశపరిచాయి. నితిన్, వెంకీ కుడుముల, రష్మిక కాంబినేషన్ లో చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నేడు గ్రాండ్ గా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది.
ఈ మూవీ లాంచ్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. నితిన్ రష్మిక ల ముహూర్తం షాట్ ని తన క్లాప్ తో చిరు ప్రారంభించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రారంభంలోనే ఈ క్రేజీ కాంబినేషన్ పై అందరిలో ఆసక్తి ఏర్పడింది.
ఛలో, భీష్మ చిత్రాలతో దర్శకుడు వెంకీ కుడుములపై అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. సింపుల్ కథని తన రచన, కామెడీ సన్నివేశాలతో సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయగలనాని వెంకీ నిరూపించుకున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో త్రివిక్రమ్ శైలి ఉందని చాలా మంది చెబుతారు. ఎందుకంటే వెంకీ కుడుముల త్రివిక్రమ్ శిష్యుడే.
ఇదిలా ఉండగా రీసెంట్ గా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ వీడియోలో ఈ చిత్రం గురించి చిన్న హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఛలో, భీష్మ రెండు చిత్రాలు ఎంటర్టైన్మెంట్ ప్రధానంగానే ఉంటాయి. ఈసారి కూడా లాంటి కథేనా అని రష్మిక, నితిన్ ఆసక్తిగా వెంకీని అడగడం.. లేదు వేరే అని వెంకీ సమాధానం ఇవ్వడం ఆసక్తిని పెంచేసింది. అడ్వెంచర్ థ్రిల్లర్ కథని వినోదభరితంగా వెంకీ చూపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి తమిళ నటుడు, సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ బాణీలు అందించబోతున్నారు.
భీష్మ తర్వాత వెంకీ కుడుముల మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ప్రయత్నించారు. అయితే కథలో కొన్ని అంశాలు నచ్చకపోవడంతో చిరు స్టోరీని రిజెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వెంకీ అదే కథతో ఈ చిత్రం చేస్తున్నారా అనేది క్లారిటీ లేదు. మొత్తంగా మెగాస్టార్ చిరంజీవే వచ్చి ఈ చిత్రాన్ని లాంచ్ చేయడం విశేషం. డైరెక్టర్ బాబీ, గోపీచంద్ మలినేని కూడా అతిథులుగా హాజరయ్యారు.