సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసుల నివేదికపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అసంతృప్తితో ఉంది. తాజాగా హ్యూమన్ రైట్స్ కమిషన్ సీవీ ఆనంద్ కు నోటీసులు పంపడం కీలక పరిణామం.
పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దేశం మొత్తం సంచలనం సృష్టించింది.ఈ సంఘటనలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె ఏడేళ్ల కొడుకు శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. కిమ్స్ ఆసుపత్రిలో 5 నెలలు చికిత్స తీసుకున్నప్పటికీ శ్రీతేజ్ పరిస్థితి మెరుగవలేదు. బ్రెయిన్ కి సంబంధించిన సమస్యలు తలెత్తాయి. ఇటీవలే శ్రీతేజ్ ని ఆసుపత్రి నుంచి డిశ్చార్ చేశారు.
సీవీ ఆనంద్కు నోటీసులు
ఇదిలా ఉండగా ఈ సంఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సీరియస్ గా స్పందించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఈ ఏడాది జనవరిలోనే పోలీసులను ఆదేశించిన కమిషన్, ఇప్పుడు అందిన నివేదికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్కు నోటీసులు జారీ చేసింది.
పోలీసులపై ఎన్హెచ్ఆర్సీ అసంతృప్తి
కమిషన్ అభిప్రాయం ప్రకారం, పోలీసుల సమర్పించిన నివేదికలో పూర్తి వివరాలు లేకపోవడమే కాక, ఘటన సమయంలో పోలీసులు తీసుకున్న చర్యలపై స్పష్టతలేదని పేర్కొంది. ముఖ్యంగా, డీజేలు, బాణసంచా, పెద్ద ఎత్తున హంగామా పోలీస్ స్టేషన్ కు సమీపంలో జరుగుతుండగా అక్కడి పోలీసు సిబ్బంది ఏమి చేస్తున్నారు? అని కమిషన్ ప్రశ్నించింది.
అనుమతి లేకుండా అల్లు అర్జున్ ఎలా వచ్చారు ?
ఈ నివేదికలో, సినీ నటుడు అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వచ్చిన తర్వాతే తొక్కిసలాట జరిగింది అని పోలీసులు పేర్కొన్నారు. అయితే పోలీసులు లాఠీ ఛార్జ్ చేయలేదని కూడా స్పష్టం చేశారు. కానీ కమిషన్ మాత్రం, స్పెషల్ షోకు అనుమతి ఇవ్వకపోయినా అల్లు అర్జున్ ఆ థియేటర్కు ఎందుకు వచ్చారనే అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో, పూర్తి సమాచారం, ఆధారాలతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించాలంటూ కమిషన్ సీవీ ఆనంద్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రజల ప్రాణాలకు హాని కలిగే విధంగా జరిగిన ఈ ఘటనపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది.
పుష్ప 2 చిత్రం విడుదల సందర్భంగా అభిమానుల తాకిడి అధికంగా ఉండటంతోనే ఈ అవాంఛనీయ ఘటన చోటుచేసుకున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ నోటీసులతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ సంఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం ఆ తర్వాత బెయిల్ పై రిలీజ్ కావడం జరిగింది.