కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డైరెక్ట్ ఓటీటీలో విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బంగార్రాజు మూవీతో నాగార్జున హిట్ కొట్టారు. సంక్రాంతి కానుకగా విడుదలైన మల్టీస్టారర్ బంగార్రాజు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. 2016లో విడుదలైన హిట్ మూవీ సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి బంగార్రాజు సీక్వెల్. నాగార్జున-నాగ చైతన్య (Naga Chaitanya)కలిసి నటించారు. ఇక వీరికి జంటగా రమ్యకృష్ణ, కృతి శెట్టి నటించడం జరిగింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో 2022 సంక్రాంతికి పెద్ద చిత్రాలేవీ విడుదల కాలేదు. ఇక విలేజ్ ఫ్యామిలీ అండ్ ఫాంటసీ డ్రామాగా విడుదలైన బంగార్రాజు సంక్రాంతి సీజన్ ని క్యాష్ చేసుకుంది. తక్కువ సినిమా టికెట్స్ రేట్లతో మంచి వసూళ్లు అందుకుంది.
బంగార్రాజు విజయంతో ఊపుమీదున్న నాగార్జున (Nagarjuna)ది ఘోస్ట్ మూవీ చకచకా పూర్తి చేస్తున్నారు. గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ది ఘోస్ట్ తెరకెక్కిస్తున్నారు. చాలా భాగం విదేశాల్లో రిచ్ లొకేషన్స్ లో షూట్ చేశారు. సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ మంచి రేటు ఆఫర్ చేసిన నేపథ్యంలో మేకర్స్ ఓటీటీ విడుదలకు మొగ్గు చూపుతున్నారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తుంది.
సీనియర్ హీరో వెంకటేష్ నారప్ప, దృశ్యం 2 చిత్రాలను నేరుగా ఓటీటీలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాల నిర్మాణ భాగస్వామిగా సురేష్ ప్రొడక్షన్ ఉంది. నాగార్జున ఇప్పటి వరకు నేరుగా ఓటీటీలో విడుదల చేయలేదు. మరి ఘోస్ట్ (The Ghost)మూవీ డిజిటల్ రిలీజ్ చేస్తే వెంకటేష్ తర్వాత ఆ పని చేసిన స్టార్ హీరోగా నాగార్జున నిలుస్తాడు. గత ప్రకటనల ప్రకారం ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.