బుల్లితెరపై నాగార్జున కింగ్ అనిపించాడు. తమ జెనరేషన్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లను వెనక్కి నెట్టి టాప్ పొజిషన్ సొంతం చేసుకున్నారు. నాగార్జున బంగార్రాజు హైయెస్ట్ టీఆర్పీ తో దుమ్మురేపింది.
దశాబ్దాల పాటు సిల్వర్ స్క్రీన్ ని చిరంజీవి, ఎన్టీఆర్, వెంకటేష్, నాగార్జున ఏలారు. ఈ జనరేషన్ స్టార్స్ వచ్చేవరకూ ఈ నలుగురిదే హవా. ఇప్పటికీ తమ మార్క్ చిత్రాలతో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. వెంకీ మల్టీస్టారర్స్ కి మారిపోగా చిరంజీవి, బాలయ్య మాత్రం మాస్ కమర్షియల్ చిత్రాలు చేస్తున్నారు. నాగార్జున సైతం సోలో హీరోగా సత్తా చాటేందుకు చూస్తున్నారు. కాగా నాగార్జున బుల్లితెరపై తన తోటి హీరోలను వెనక్కు నెట్టారు. టీఆర్పీలో టాప్ అనిపించారు.
ఈ నలుగురు హీరోలు నటించిన రీసెంట్ చిత్రాలు అఖండ, ఆచార్య, బంగార్రాజు, ఎఫ్ 3 వివిధ ఛానల్స్ లో ప్రసారమయ్యాయి. ఈ చిత్రాల్లో బంగార్రాజు అత్యధిక టీఆర్పీ రాబట్టి మిగతా హీరోలకు షాక్ ఇచ్చింది. బ్లాక్ బస్టర్ గా నిలిచిన అఖండ సైతం బంగార్రాజు కంటే వెనకబడటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అఖండ విజయంతో పోల్చుకుంటే బంగార్రాజు తక్కువే. అయినా బుల్లితెర ప్రేక్షకులు అమితంగా ఆదరించారు.
జీ తెలుగులో ప్రసారమైన బంగార్రాజు 14 టీఆర్పీ రాబట్టింది. తర్వాత బాలకృష్ణ అఖండ 13.31 టీఆర్పీతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇక వెంకటేష్-వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ ఎఫ్ కేవలం 8.26 టీఆర్పీ రాబట్టింది. ఈ లిస్ట్ లో చివరి స్థానంలో ఆచార్య నిలిచింది. ఆచార్య దారుణంగా 6.30 టీఆర్పీ అందుకుంది. ఆచార్య చిరంజీవి కెరీర్లో డిజాస్టర్ గా రికార్డులకు ఎక్కింది. చిరు-చరణ్ ల మల్టీస్టారర్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య పూర్తిగా విఫలం చెందింది.
