సక్సెస్ కోసం నాగార్జున, అల్లరి నరేష్ ప్రయోగం.. గట్టేక్కించేనా?
పరాజయాల్లో ఉన్న హీరో నాగార్జున, అల్లరి నరేష్ కలిసి సినిమా చేయబోతున్నారు. కొత్త దర్శకుడిగా ఓ ప్రయోగం చేయబోతున్నారు. మరి అది సక్సెస్ ఇస్తుందా?
మల్టీ స్టారర్ చిత్రాలు చేయడంలో నాగార్జున ముందే ఉంటారు. ఆయన ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు. ఈ మధ్య కాలంలో ఆయన `బంగార్రాజు`లో తన కుమారుడు నాగచైతన్యతో కలిసి నటించారు. అంతకు ముందు `దేవదాసు` చిత్రం నానితో కలిసి చేశాడు. `మనం`లో ఫ్యామిలీ అంతా కలిసి చేశారు. ఇప్పుడు మరోసారి మల్టీస్టారర్ తరహా సినిమా చేయబోతున్నారు. అల్లరి నరేష్తో కలిసి ఆయన ఓ సినిమాలో నటించబోతుండటం విశేషం.
పాపులర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకుడిగా మారి నాగార్జున హీరోగా సినిమా చేయబోతున్నారు. ఇది ఆల్మోస్ట్ కన్ఫమ్ అయ్యింది. ఇందులో అల్లరి నరేష్ కూడా నటించబోతున్నారని సమాచారం. కమర్షియల్ అంశాలను, కామెడీ మేళవింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కబోతుందని సమాచారం. నాగార్జున చివరగా `ది ఘోస్ట్` చిత్రంలో నటించారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోయింది.
ఈ నేపథ్యంలో కమర్షియల్ సినిమా వైపు నాగ్ అడుగులు వేస్తున్నారు. రైటర్ ప్రసన్న కుమార్.. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన చిత్రాలకు రైటర్గా పనిచేస్తున్నారు. ఇటీవల వీరి కాంబినేషన్లో `ధమాకా` వచ్చిన విషయం తెలిసిందే. దీంతోపాటు `నేను లోకల్`, `సినిమా చూపిస్త మావ` వంటి సినిమాలకు వర్క్ చేశారు. ఇప్పుడు ప్రసన్నకుమార్ డైరెక్టర్గా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
ఇదిలా ఉంటే నాగ్ `బంగార్రాజు`తో మెప్పించినా, `ది ఘోస్ట్`తో పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా రూట్ మార్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా అల్లరి నరేష్తో కలిసి నటించేందుకు సిద్ధమయ్యారని టాక్. మరోవైపు `నాంది` సినిమాతో పూర్వ వైభవాన్ని పొందిన అల్లరి నరేష్ ఇటీవల చేసిన `ఇట్లు మారెడుమిల్లి నియోజకవర్గం` చిత్రం పరాజయం చెందింది. దీంతో ఆయన కూడా ప్రయోగాల దిశగా అడుగులు వేస్తున్నారు. అలా వీరిద్దరికి ఈ ప్రాజెక్ట్ ని ప్రసన్న కుమార్ సెట్ చేసినట్టు టాక్. మరి నాగ్, అల్లరి నరేష్ సక్సెస్ కోసం చేసే ఈ ప్రయోగం ఫలిస్తుందా? లేదా అనేది చూడాలి.