Rajamouli: డబ్బుల కోసమే నేను సినిమాలు తీస్తాను
ఇండియాలో భారీ చిత్రాల దర్శకుడిగా మారిన రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను డబ్బుల కోసమే సినిమా చేస్తానని వెల్లడించారు.
కళకు మించి సినిమా అనేది వ్యాపారం. పరిశ్రమ నిలబడాలంటే సినిమాలు కమర్షియల్ గా ఆడాలి. నిర్మాత నాలుగు రూపాయలు సంపాదించినప్పుడే మరో మూవీ నిర్మించే ఛాన్స్ ఉంటుంది. జూదంతో సమానమైన సినిమా నిర్మాణంలో వందల కోట్లు పెట్టుబడి పెట్టడం ఆషామాషీ కాదు. సినిమా ప్లాప్ అయితే నిర్మాత రోడ్డున పడతాడు. ఉన్నవన్నీ పోగొట్టుకొని కనుమరుగైన నిర్మాతలు పదుల సంఖ్యలో ఉంటారు. కాబట్టి మన సినిమాకు డబ్బులు వస్తాయా లేదా అనేదే ముఖ్యం అంటున్నారు దర్శకధీరుడు రాజమౌళి.
తాను తెరకెక్కించే ప్రతి సినిమా ప్రధాన లక్ష్యం కలెక్షన్స్ అని రాజమౌళి(Rajamouli) కుండబద్దలు కొట్టారు. కేవలం డబ్బుల కోసమే నేను సినిమాలు తీస్తాను అన్నారు. నా కష్టం నచ్చి అవార్డులు, గౌరవాలు దక్కితే దాన్ని అదనపు ఫలితంగా తీసుకుంటాను. అంతే కానీ అవార్డులు ఆశించి నేను సినిమాలు చేయను. తీసే సినిమా జనాలకు నచ్చాలి.భారీ వసూళ్లు రాబట్టాలి అనేదే ప్రధాన కర్త్యవం అని చెప్పుకొచ్చారు.
రాజమౌళి చెప్పినట్లు ఆయన సినిమా సూత్రం అలానే ఉంటుంది. కళాత్మక చిత్రాలు చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. కమర్షియల్ ఫార్మట్ వదలకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చిత్రాలు చేశారు. ఆయన కెరీర్లో తెరకెక్కిన మర్యాద రామన్న, ఈగ ప్రయోగాత్మక చిత్రాలుగా పేర్కొనవచ్చు. వాటిలో కూడా లవ్, రొమాన్స్, సాంగ్స్, కామెడీ వంటి కమర్షియల్ అంశాలు మరువలేదు. ప్రతి సీన్ తెరకెక్కించే ముందు థియేటర్లో ప్రేక్షకుడు దీని గురించి ఏమనుకుంటాడు. నచ్చుతుందా లేదా అనే కోణంలో ఆలోచిస్తానని రాజమౌళి గతంలో చెప్పారు.
రాజమౌళి సినిమా ప్రథమ లక్ష్యం డబ్బులు సంపాదించడమే అని చెప్పకనే చెప్పారు. అందుకే ఆయన అపజయమెరుగని దర్శకుడు అయ్యాడు. ప్రస్తుతం మహేష్(Mahesh Babu) మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు. మే లేదా జూన్ నెలలో రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది.