మగాళ్లకి లేని ఇబ్బంది మాకెందుకు.. అనసూయ కామెంట్స్!
చాలా తొందరగా పెళ్లిచేసుకున్నావ్, లేకపోతే టాప్ హీరోయిన్వి అయ్యేదానివి అని ఎక్కడపడితే అక్కడ ఎవరు పడితే వారు అనసూయను అడుగుతున్నారట. అలాంటి వాళ్లకు ఆమె స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.
బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్'తో పాపులర్ అయిన యాంకర్ అనసూయ ఆ తరువాత సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ నటిగా తన సత్తా చాటుతోంది. 'రంగస్థలం' సినిమాలో ఆమె పోషించిన పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఓ పక్క టీవీ షోలు, మరోపక్క సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
సోషల్ మీడియాలో తన ఫాలోవర్లకు అనసూయ ఓ మెసేజ్ పంపారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి.. పెళ్లిమ పిల్లల ప్రస్తావన తన వద్ద తీసుకొచ్చే వారికి అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తన భర్త సుశాంక్ భరద్వాజ్, ఇద్దరు పిల్లలతో కలిసి తీసుకున్న ఫోటోని అనసూయ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఆ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్లు.. 'అనసూయ ఎందుకు అంత త్వరగా పెళ్లి చేసుకున్నావ్..? కొంతకాలం ఆగి ఉంటే టాప్ హీరోయిన్ అయిపోయేదానివి' అంటూ కామెంట్స్ పెట్టారు. మరికొందరేమో.. 'ఫ్యామిలీ ఫోటోలు పెడితే నీకు డిమాండ్ తగ్గిపోతుందంటూ' చెబుతున్నారు. ఈ మాటలతో విసిగిపోయిన అనసూయ వారందరినీ ఉద్దేశిస్తూ ఘాటుగా బదులిచ్చింది. తను ఇప్పటివరకు సాధించిన దాని గురించి అసలు సిగ్గుపడడం లేదని, తన జీవితంలో అతిపెద్ద విజయం ఎప్పటికీ తన కుటుంబమేనని చెప్పుకొచ్చింది.
రోజంతా కష్టపడి ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ మనల్ని ప్రేమించే, మనం ప్రేమించే వాళ్లు ఉంటారని.. ముందు ప్రాధాన్యతలు తెలుసుకోవాలని అన్నారు. తను పెళ్లి చేసుకోవడం, తల్లిని కావడం వంటి అంశాలు వృత్తి మీద ప్రభావం చూపకూడదని.. ఈ విషయంలో మగాళ్లకి లేని ఇబ్బందులు ఆడవాళ్లకు ఎందుకని ప్రశ్నించారు. అదృష్టం కొద్దీ తనతో ప్రతిభగలవారితో పని చేశానని, పని చేస్తున్నానని.. వారు తన రిలేషన్ షిప్ స్టేటస్ పై మాట్లాడరని చెప్పుకొచ్చింది.