మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నేడు 65వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన, కేరళా రాజకీయాల్లో దుమారం రేపిన పొలిటికల్ చిత్రాల గురించి తెలుసుకుందాం.
మోహన్లాల్ ఇండియన్ సినిమాల్లో ఒక కంప్లీట్ యాక్టర్ గా పేరుతెచ్చుకున్నారు. పాత్ర ఏదైనా అందులో జీవించడం మోహన్లాల్కి వెన్నతో పెట్టిన విద్య. ఇంకా చెప్పాలంటే ఆయా పాత్రలకు ప్రాణం పోయడంలో ఆయన దిట్ట. నటుడిగానే కాదు, కమర్షియల్ హీరోగానూ ఆయన మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనాలు సృష్టించారు.
కేరళాలో సినీ చరిత్రకు సంబంధించిన అనేక రికార్డులు మోహన్లాల్ పేరుతోనే ఉండటం విశేషం. మలయాళ సూపర్ స్టార్గా రాణిస్తూ ఇప్పటికీ సరికొత్త సంచలనాలకు కేరాఫ్గా నిలుస్తున్న మోహన్ లాల్ నేడు 65వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
పాత్రలపరంగా.. ఒక గ్రామస్తుడిగా, అండర్ వరల్డ్ నాయకుడిగా, ప్రేమికుడిగా, ఇలా ఎన్నో పాత్రల్లో నటించిన మోహన్ లాల్, రాజకీయ నాయకుడిగా కూడా మెప్పించారు. ఆయన నటించిన 'లూసిఫర్' (సీక్వెల్ 'ఎంపురాన్') చిత్రంలో రాజకీయ నాయకుడిగా కనిపించారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా అండర్ వరల్డ్ డాన్ గా కూడా ఆయన ఈ చిత్రంలో నటించారు.
పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మోహన్ లాల్ నటించిన చిత్రాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఆయన నటించిన రాజకీయ చిత్రాల్లో సంచలనాలకు కేరాఫ్గా నిలిచిన మూవీస్ గురించి తెలుసుకుందాం.
`లూసీఫర్`- రాజకీయ నాయకుడిగా 'స్టీఫెన్ నెడుంపల్లి'
`లూసీఫర్` సినిమాలో.. కేరళ రాజకీయాల్లో ఒక పేరు మోసిన రాజకీయ నాయకుడైన 'రామ్ దాస్' శిష్యుడు 'స్టీఫెన్ నెడుంపల్లి'. కేరళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే సామర్థ్యం ఉన్న నాయకుడు. 'లూసిఫర్' సీక్వెల్ 'ఎంపురాన్' లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినట్లు చూపించారు.
కానీ ఆ తర్వాత 'స్టీఫెన్' రాజకీయాల్లో లేరు. రాజకీయ నాయకుడిగా కాకుండా అండర్ వరల్డ్ డాన్గా `ఎంపురాన్`లో చూపించారు. నిజానికి 'స్టీఫెన్ నెడుంపల్లి' ఎవరు? ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడమే పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన 'లూసిఫర్' చిత్రం.
`భూమియిలే రాజాక్కన్మార్`- మంత్రిగా మోహన్ లాల్!
మోహన్ లాల్ ని సూపర్ స్టార్ గా మార్చిన తంబి కన్నన్తాన్ దర్శకత్వం వహించిన చిత్రం 'భూమియిలే రాజాక్కన్మార్'. ఇందులో దక్షిణ కుటుంబానికి చెందిన 'మహేంద్ర వర్మ' పాత్రలో మోహన్ లాల్ నటించారు. డబ్బున్న, అహంకారం ఉన్న పాత్ర అది. 'మహేంద్ర వర్మ' రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు. ఎన్నికల్లో పోటీ చేసి మంత్రి అవుతారు. కానీ ఆ తర్వాత అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడతారు.
తంబి కన్నన్తాన్ తో చేసిన ఇతర చిత్రాల మాదిరిగానే, ఇందులోనూ మోహన్ లాల్ విలన్గా మొదలై ప్రేక్షకుల ప్రేమను సంపాదించుకునే నాయకుడు అవుతాడు. మొదట్లో కుతంత్రాలతో కూడిన రాజకీయ నాయకుడిగా మొదలైన మహేంద్ర వర్మ, చివరికి ప్రజల పక్షాన నిలుస్తారు. 'మహేంద్ర వర్మ'గా మోహన్ లాల్ అద్భుతంగా నటించడంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది.
`లాల్ సలామ్`- నెట్టూరాన్ తో జాగ్రత్త!'
'బీడీ ఉందా సఖా, మ్యాచ్ బాక్స్ తీసుకోవడానికి, మ్యాచ్ బాక్స్ ఉందా సఖా, బీడీ తీసుకోవడానికి..' తొంభైలలో కేరళా స్నేహితుల మధ్య తరచుగా వినిపించే డైలాగ్స్. `లాల్ సలామ్` చిత్రంలో నెట్టూరాన్, ఆంటోనీ పాత్రల మధ్య జరిగే సంభాషణ ఇది. మోహన్ లాల్, మురళి చెప్పిన ఈ డైలాగ్స్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి.
కేరళ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన 'లాల్ సలామ్' చిత్రం మలయాళీల మనసు దోచుకుంది. సంచలనంగా మారింది. కమ్యూనిస్ట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో 'స్టీఫెన్ నెట్టూరాన్' పాత్రలో మోహన్ లాల్ నటించారు. వేణు నాగవల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
'ఇరువర్'(ఇద్దరు)
`ఇద్దరు` సినిమా అప్పట్లో పెద్ద సంచలనం. తమిళనాడు రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ఆ స్టేట్ రాజకీయాలను షేక్ చేసింది. ఈ సినిమాలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ పాత్రలో మోహన్ లాల్ నటించారు. ఆయన స్నేహితుడు రాజకీయ నాయకుడు తమిజ్ సెల్వన్(కరునానిధి) పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు.
మణిరత్నం దర్శకత్వం వహించిన 'ఇరువర్' (ఇద్దరు) మూవీలో సినిమా స్టార్ ఆనందన్ పాత్రలో మోహన్ లాల్ నటించారు. ఎంజీఆర్ జీవితం ఆధారంగా రూపొందించిన పాత్ర 'ఆనందన్'. ఎంజీఆర్ నట జీవితం, రాజకీయ జీవితం రెండింటినీ కలిపి 'ఆనందన్' గా మోహన్ లాల్ నటించడంతో 'ఇరువర్' మూవీ ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది.
'రక్తసాక్షిగళ్ జిందాబాద్'
.
కేరళలో కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర, అభివృద్ధి గురించి చెప్పే చిత్రం 'రక్తసాక్షిగళ్ జిందాబాద్'. 'త్యాగరాజ మఠం శివసుబ్రహ్మణ్య అయ్యర్' అనే కమ్యూనిస్ట్ పాత్రలో మోహన్ లాల్ నటించారు. సురేష్ గోపి, మురళి వంటి వారు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. వేణు నాగవల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
చెరియన్ కల్పకవాడి ఈ చిత్రానికి కథ అందించారు. మోహన్ లాల్ నటించిన రాజకీయ చిత్రాల్లో 'రక్తసాక్షిగళ్ జిందాబాద్` మరో సంచలనాత్మక మూవీగా చెప్పొచ్చు. అక్కడి రాజకీయాలను బాగా ప్రభావితం చేసిన మూవీ ఇది. బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది.