మోహన్బాబు, ఆయన కుమారులకు ఊరట.. ఆ కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై నమోదైన కేసుకు సంబంధించి ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.
ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ధర్నా చేశారనే ఆరోపణలపై మోహన్బాబు, ఆయన కుమారులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రస్తుతం తిరుపతి కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే ఈ విచారణను నిలిపివేయాలని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. మోహన్బాబు పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. తిరుపతి కోర్టులో జరుగుతున్న విచారణను 8 వారాలపాటు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
2019 మారచిలో అప్పటి ప్రభుత్వం.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో రావాల్సిన మొత్తాన్ని చెల్లించడం లేదని మోహన్ బాబు కుటుంబ సభ్యులు తిరుపతి- మదనపల్లె జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ నిరసనలో మోహన్ బాబు విద్యాసంస్థలకు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో.. సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా నిరసనకు దిగిన మోహన్ బాబు, ఆయన కుమారులతో పాటుగా పలువురిపై చంద్రగిరి పోలీసులు ఐపీసీ సెక్షన్ 341, 171(ఎఫ్), సెక్షన్ 290 పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి మోహన్ బాబు, ఆయన కుమారులు ఈ ఏడాది జూన్ నెలలో తిరుపతిలోని నాలుగో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. అయితే వాదనలు విన్న మేజిస్ట్రేట్ కేసును వాయిదా వేసి విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేశారు. కోర్టుకు హాజరైన సమయంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కోర్టు కాంప్లెక్స్ వరకు మోహన్ బాబు కుటుంబం పాదయాత్ర చేపట్టింది.