'మిషన్ మంగళ్' కోట్లు కొల్లగొడుతోంది!
మిషన్ మంగల్.. చూడ్డానికి అక్షయ్ కుమార్ సినిమాలా కనిపిస్తుంది. కానీ కాదు.. అది మహిళల సినిమా. ఐదుగురు మహిళా శాస్త్రవేత్తలు కలిసి అసాధ్యం అనుకన్న అంతరిక్ష ప్రయోగాన్ని ఎలా సాధ్యం చేసి చూపించారనే కథతో తెరకెక్కిన చిత్రమిది.
అక్షయ్ కుమార్ నటించిన 'మిషన్ మంగళ్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విద్యాబాలన్, తాప్సి పన్ను, సోనాక్షి సిన్హా, నిత్యా మీనన్, కృతి కుల్హరి ప్రధాన పాత్రలు పోషించారు. నిజానికి ఇదొక లేడీ ఓరియెంటెడ్ సినిమా అనే చెప్పాలి.
కమర్షియాలిటీ కోసం అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోని తీసుకొచ్చారు. అతడికున్న క్రేజ్ బట్టి సినిమా అమ్ముడైంది. కానీ సినిమాకి హైలైట్ గా నిలిచింది మాత్రం ఇందులోని మహిళల విజయగాథ.. ఆ ఐదుగురు తారల నటన. గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజే హిట్ టాక్ తెచ్చుకుంది. వసూళ్ల పరంగా కూడా సత్తా చాటుతోంది.
మొదటిరోజు ఈ సినిమా ఏకంగా రూ.29.5 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకి పోటీగా 'బత్లా హౌస్' లాంటి సినిమాలు విడుదలయ్యాయి. అలానే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా కాస్త క్రేజ్ ఉన్న సినిమాలు విడుదలయ్యాయి.
కానీ వాటన్నింటినీ తట్టుకొని ఈ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడం మామూలు విషయం కాదు. అక్షయ్ కుమార్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిందీ సినిమా. గురువారం నాడు విడుదలైతేనే ఓపెనింగ్స్ కుమ్మేసిన ఈ సినిమా లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకొని వంద కోట్ల గ్రాస్ ని క్రాస్ చేయడం ఖాయమంటున్నారు.