చిత్రపరిశ్రమకి ప్రభుత్వం అండగా ఉంటుందిః మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. శనివారం తెలుగు పిల్మ్ ఇండస్ట్రీ ప్రతినిధులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం షూటింగ్ లు నిలిచిపోయి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులకు అవసరమైన నిత్యావసర వస్తువులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ అందజేసిన విషయాన్ని ఈ సందర్బంగా ఇండస్ట్రీ ప్రతినిధులు గుర్తుచేసుకున్నారు.
క్లిష్ట పరిస్థితులలో ఉన్న తమకు అండగా నిలిచి ఆదుకున్న మిమ్మల్ని మరువలేమని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేస్తుందని, అందరు దీనికి సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించడం శానిటైజర్ ను వినియోగించడం వంటి నిబంధనలు పాటిస్తూ కరోనా భారిన పడకుండా రక్షించుకోవాలని సూచించారు. రెండో దశలో లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా సినీ పరిశ్రమలోని కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఆదుకోవాలని కోరారు.
అదే విధంగా ప్రతి ఒక్క కార్మికుడికి కరోనా వ్యాక్సిన్ అందేలా ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో తెలుగు పిల్మ్ ఇండస్ట్రీ అధ్యక్షులు అనిల్ కుమార్, పీఎస్ఎన్, దొర, చిత్రపురి కాలనీ సెక్రెటరీ కాదంబరి కిరణ్ తదితరులు ఉన్నారు.