పద్మశ్రీలకు పద్మ విభూషనుడి సత్కారం, ఇంటికి ఆహ్వానించి మరీ సన్మానించిన మెగాస్టార్ చిరంజీవి
పద్మశ్రీ గ్రహీతలను ప్రత్యేకంగా సన్మానించారు పద్మవిభూషన్ చిరంజీవి. వారిని స్వయంగా ఇంటికి పిలిపించిన మెగాస్టార్ ఘనంగా సత్కరించారు.
![Megastar Chiranjeevi Invited Padma Shri Award Winners Dr Anandachari Velu and Gaddam Sammaiah JMS Megastar Chiranjeevi Invited Padma Shri Award Winners Dr Anandachari Velu and Gaddam Sammaiah JMS](https://static-ai.asianetnews.com/images/01hneqqe371bzbw5eqfgpj6wt8/3-jpg_363x203xt.jpg)
రీసెంట్ గా రిపబ్లిక్ డే సందర్భంగా పలువురు ప్రముఖులకు పద్మా అవార్డులను ప్రకటించింది క్రేంద్ర ప్రభుత్వం. వివిధ రంగాల్లో ప్రతిభా చాటిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రముఖులు ఉండగా అందులో మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడు లాంటి సెలబ్రిటీలకు పద్మవిభూషణ్ పురస్కారాలకు ఎంపికవ్వగా... అలాగే చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు, శిల్పి ఆనందాచారి వేలు కు పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి వీరిద్దరిని ప్రత్యేకంగా తన ఇంటికి ఆహ్వానించి సత్కరించారు.
గడ్డం సమ్మయ్యతో పాటు ఆనందాచారిని కూడా ఘనంగా సత్కరించారు మెగాస్టార్ . ఇద్దరికి ప్రత్యేకంగా చిరంజీవి శాలువా కప్పి సన్మానం చేశారు. అలాగే చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చినందుకు ఆయన్ను కూడా ఇద్దరు సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సమ్మయ్యకు, ఆనందాచారికి పద్మ శ్రీ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ‘అంతరించిపోతున్న చిందు యక్షగాన కళారూపానికి జీవం పోస్తున్న గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ రావడం ఎంతో ఆనందంగా ఉంది. యాదాద్రిలో అద్భుతం సృష్టంచిన ఆనందాచారిలాంటి వారిని కూడా ఇలా సత్కరించుకోవడం తన అదృష్టం అన్నారు. ఇలాంటి కళారూపాలను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. కళలను, కళాకారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడుకోవాలని’ అని మెగాస్టార్ కోరారు.
ఇక మెగాస్టార్ లాంటి నటుడు తమను సన్మానించడం తమకు ఎంతో ఆనందంగా ఉంది అన్నారు సమ్మయ్య, ఆనందాచారి. ఇక జనగామ జిల్లా అప్పిరెడ్డిపల్లికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య 50 ఏళ్లుగా యక్షగాన కళాకారుడిగా 19వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు.కళారత్న పురస్కారం తో పాటు ఎన్నో సత్కారాలు పొందారు.. కళారంగానికి ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.
ఇక డాక్టర్ ఆనందాచారి యాదాద్రి ఆలయాన్నిపునర్నిర్మాణం చేయడంలో ప్రముఖంగా వ్వవహనించారు. ప్రధాన స్థపతి హోదాలో ఆయన రాతి శిల్ప రూపకర్తగా కృషి చేశారు. అష్టభుజి మండప ప్రాకారాలు కాకతీయ, ద్రవిడ, చోళ శిల్పకళా రీతిలో తీర్చిదిద్దేందుకు కష్టపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని శిల్ప కళాశాలలో తొలిదశలో శిక్షణ పొంది, ప్రప్రథమంగా ఉమ్మడి ఆంధ్రపదేశ్లోని దేవాదాయ శాఖకు చెందిన స్థపతి హోదాలో పనిచేశారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. వీరిని తాజాగా చిరంజీవి సత్కరించారు.