అఖిల్ మిస్సయ్యాడా?
- మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహానుభావుడు
- శర్వానంద్, మెహరీన్ జంటగా తెరకెక్కిన మహానుభావుడు
- అఖిల్ తో మహానుభావుడు తీయాలనుకున్న మారుతి
‘ఈరోజుల్లో’తో దర్శకుడిగా తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టాడు మారుతి. ఆ చిత్ర విజయంతో మారుతి పేరు మార్మోగిపోయింది. ‘భలే భలే మగాడివోయ్’తో విజయవంతమైన చిత్రాల దర్శకుడిగా మారిపోయారు. వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. ఇప్పుడు శర్వానంద్ని ‘మహానుభావుడు’గా మార్చిందీ ఆయనే. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు మారుతి మాట్లలోనే..
‘‘ఆనంద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మనిషి చాలా మంచివాడు. కానీ ఒకటే లోపం.. అతి పరిశుభ్రత. దాని వల్ల ఆనంద్ జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయి అనేదే కథ. వినోదంతో ఆసక్తికరంగా తెరపై చూపించాం. ఈ కథకు ఏదైనా ప్రేరణ ఉందా అని చాలా మంది అడుగుతున్నారు.ప్రత్యేకంగా ఫలానా అనేం లేదు. సమాజంలో రకరకాల మనస్తత్వాలున్న వ్యక్తుల్ని చూస్తుంటాం. ఈ కథా అలా తయారైందే. వినోదమే కాదు, చిన్న సందేశం కూడా ఉంటుంది. దాన్నీ నవ్విస్తూనే చెప్పాం.
కథ డిమాండ్ను బట్టి.. ఆ కథకు ఎవరైతే సరిపోతారో చూసుకొనే నేను సినిమాలు చేస్తున్నాను. పెద్ద హీరోలకు సరిపోయే భిన్నమైన కథలు నా వద్ద ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు వారితో సినిమా చేస్తాను. ఈ కథ మాత్రం శర్వానంద్ కే సరిపోతుందనిపించింది. అందుకే ఆయనను ఎంచుకున్నాను. కెరీర్ తొలినాళ్ల నుంచి శర్వానంద్ కథాబలం కలిగిన, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే ఎంచుకుంటున్నాడు. సక్సెస్, ఫెయిల్యూర్స్, స్టార్డమ్, వసూళ్లు వంటి లెక్కలు వేసుకోకుండా ప్రతిసారి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కథ అయితే.. తనకు బాగుంటుందని అనిపించింది.
మొదట ఈ సినిమాని అఖిల్ తో చేద్దామనుకున్నాను. నాగార్జునతోపాటు అఖిల్ కి కూడా కథ వినిపించాను. వారికి నచ్చింది కానీ. విక్రమ్ తో సినిమాలో అఖిల్ బిజీగా ఉండటంతో ఆలస్యమౌతుందని శర్వానంద్ తో తెరకెక్కించాను.’’