రజనీకాంత్ వల్లే నా కెరీర్ ముగిసి పోయిందిః హాట్ టాపిక్ అవుతున్న మనీషా కోయిరాలా వ్యాఖ్యలు..
అలనాటి తార మనీషా కోయిరాలా రజనీకాంత్ `బాబా` సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు పెద్ద హాట్ టాపిక్గా మారాయి.
హిందీతోపాటు సౌత్లోనూ స్టార్ హీరోయిన్గా రాణించింది మనీషా కోయిరాలా. ఆమె అనేక సంచలన చిత్రాల్లో భాగమయ్యింది. `భారతీయుడు`, `ఒకే ఒక్కడు` వంటి చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ కి బాగా దగ్గరైన విషయం తెలిసిందే. సౌత్లో నటించింది చాలా తక్కువే అయినా తన ఇంపాక్ట్ ని చూపించింది. క్యాన్సర్ బారిన పడి కోలుకున్న ఆమె రజనీకాంత్తో `బాబా` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
తాజాగా ఆమె రజనీకాంత్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. `బాబా` సినిమాతో తన పని అయిపోయిందంటూ వ్యాఖ్యానించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ముచ్చటించింది. సౌత్(తమిళం)లో `బాబా` నా చివరి చిత్రం, ఆది పరాజయం చెందడంతో నా కెరీర్ ముగిసినట్టే అనుకున్నా. ముందుగా ఊహించినట్టే జరిగింది. ఆ తర్వాత నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ఆ సినిమా రీ రిలీజ్ అయ్యాక పెద్ద విజయం సాధించింది` అని చెప్పింది మనీషా కోయిరాలా. గతేడాది రజనీ బర్త్ డే సందర్భంగా `బాబా`ని రిలీజ్ చేయగా ఆకట్టుకుంది.
`బాబా` సినిమా రజనీకాంత్ డ్రీమ్ ప్రాజెక్ట్. దీనికి ఆయనే కథ అందిస్తూ నిర్మించారు. ఆధ్యాత్మిక కోణంలో సాగే ఈ సినిమాకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. 2002లో విడుదలైన ఈ చిత్రం భారీ అంచనాలతో వచ్చి పరాజయం చెందింది. ఇందులో హీరోయిన్గా మనీషా కోయిరాలా నటించింది. ఈ సినిమా బోల్తా కొట్టడంతో మనీషాకి ఆఫర్లు తగ్గిపోయాయి. ఆ తర్వాత మూడేళ్లకి కమల్తో `ముంబయి ఎక్స్ ప్రెస్` చేసింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. దీంతో సౌత్ నుంచి ఆఫర్లు రాలేదు. ఆల్మోస్ట్ సౌత్లో మనీషా కెరీర్ అయిపోయింది. ఇదే విషయాన్ని తాజాగా ఆమె ఇంటర్వ్యూలో వెల్లడించింది.
తమిళంలో నటించిన తొలి చిత్రం `బాంబే` గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది మనీషా. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1995లో విడుదలై సంచలన విజయం సాధించింది. అరవింద్ స్వామి హీరోగా నటించిన ఈ సినిమా కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది. రొమాంటిక్ డ్రామాగా యావత్ ఇండియన్ ఆడియెన్స్ లోనూ ముద్ర వేసింది. ఈ సినిమా గురించి మనీషా చెబుతూ, మొదట ఈ సినిమా చేయకూడదనుకుందట. తల్లి పాత్రలో నటిస్తే కెరీర్ దెబ్బతింటుందని అంతా హెచ్చరించారని, కానీ సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా.. మణిరత్నం గురించి, ఆయన సినిమాల గురించి చెప్పారని, ఈ సినిమా వదిలేస్తే నీ అంతా పిచ్చి వాళ్లు ఉండరని తిట్టడంతో తాను ఒప్పుకుందట. ఆ దెబ్బతో తన అమ్మతో కలిసి చెన్నై వెళ్లిపోయామని, `బాంబే` సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉందంటూ తెలిపింది.
మనీషా కోయిరాలా తెలుగులో `క్రిమినల్` చిత్రంలో నటించింది. మహేష్ భట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగుతోపాటు హిందీలో బైలింగ్వల్గా తెరకెక్కింది. రమ్యకృష్ణతోపాటు మనీషా నటించింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. కానీ చాలా వరకు బాలీవుడ్ సినిమాగానే చూశారు. అందుకే తెలుగులో ఈ బ్యూటీకి పెద్దగా పేరు రాలేదు. 2008లో `నగరం` చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది మనీషా. ఇక తెలుగులో నటించింది లేదు. కానీ తమిళ డబ్బింగ్ చిత్రాలతోనే తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ఇప్పుడు హిందీలో అడపాదడపా సినిమాలు చేస్తుంది మనీషా.