`మా` అధ్యక్షుడు మంచు విష్ణు ఎన్నికలకు సంబంధించిన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. సెప్టెంబర్‌లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయన నిర్ణయం షాకిస్తుంది.  

మంచు విష్ణు రెండేళ్ల క్రితం జరిగిన `మా` ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. హోరాహొరీగా జరిగిన ఈ `మా` ఎన్నికల్లో ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌పై మంచు విష్ణు ప్యానెల్‌ గెలుపొందింది. అయితే ఆ ఎన్నికలు సాధారణ పొలిటికల్‌ ఎన్నికలను తలపించడం విశేషం. `మా` ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యాయి. కొన్ని రోజుల పాటు చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా మోస్ట్ కాంట్రవర్సియల్‌గానూ మారడం గమనార్హం. 

ఇదిలా ఉంటే అక్టోబర్‌తో రెండేళ్లు పూర్తవుతుంది. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌లో `మా` ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఈ విషయంలో `మా` అధ్యక్షుడు మంచు విష్ణు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. వచ్చే ఏడాది మేలో నిర్వహించాలని తీర్మానించారని తెలుస్తుంది. అసోషియేషన్‌లో ఆడిట్‌ సమస్యలే దీనికి కారణమని తెలుస్తుంది. తాను చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా చేయాల్సి ఉన్న నేపథ్యంలో వచ్చే ఏడాది మే లోపు పూర్తి చేయాలనుకుంటున్నారట. అంతేకాదు తాను మరోసారి అధ్యక్ష పోటీలో ఉండబోనని, అందుకే హామీ ఇచ్చిన పనులు చేయాలని మంచు విష్ణు భావిస్తున్నారట. 

తాజాగా `మా` అసోసియేషన్‌కి సంబంధించిన సర్వ సభ్య సమావేశంలో ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారట. తాను మళ్లీ పోటీ చేయబోననే విషయాన్ని కూడా సభ్యులకు చెప్పారట. దీంతో `మా` కి ఎన్నికలు జరిగితే కొత్త అధ్యక్షుడు వస్తాడు. అందుకే ఆ లోపు తాను చేయాల్సిన పనులు పూర్తి చేస్తానని చెప్పినట్టు సమాచారం. మరి ఆడిట్‌ సమస్యలేంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పలు అనుమానాలకు తావిస్తుంది. మరి ఇందులో నిజమెంతా? ఇదొక స్ట్రాటజీనా? అనేది తెలియాల్సి ఉంది. 

ఇక మంచు విష్ణు.. చివరగా `జిన్నా` అనే చిత్రంలో నటించారు. కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందిన చిత్రమిది. పాయల్ రాజ్ పుత్‌తోపాటు సన్నీలియోన్‌ హీరోయిన్‌గా నటించారు. `జారు మిఠాయా`.. పాట ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. కానీ సినిమా డిజాస్టర్‌ అయ్యింది. ప్రస్తుతం ఆయన చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కానీ తమ ప్రొడక్షన్‌లో సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నారు.