అంత సంతోషం ఎందుకు..?: మంచు లక్ష్మి ఫైర్
సిబ్బంది తప్పుడు కారణాలు చెప్పి గంటల తరబడి విమానాశ్రయంలో ఎదురుచూసేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియాపై మండిపడ్డారు. సిబ్బంది తప్పుడు కారణాలు చెప్పి గంటల తరబడి విమానాశ్రయంలో ఎదురుచూసేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె బుధవారం రాత్రి వరుస ట్వీట్లు చేశారు.
‘మరికొంత సేపట్లో విమానం బయలుదేరుతుందని అబద్ధాలు చెబుతూ ప్రియమైన ఎయిర్ ఇండియా దాదాపు 4 గంటలు విమానాశ్రయంలో ఎదురుచూసేలా చేసింది. తొలుత ఉదయం 12.15 గంటలకు బయలుదేరుతుందని చెప్పి ఇప్పుడు మరో రెండు గంటలు ఎదురుచూడమంటున్నావు. అధికారి సరిగ్గా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు. ఆహారం లేదు, నీరు లేదు, సమాచారం లేదు. ఇలా పుణెలో వదిలేశారు’.
‘తర్వాత హైదరాబాద్లోని సిబ్బందికి ఫోన్ చేసి.. విమానం ఏమైందో పూణె సిబ్బందిని అడిగి తెలుసుకోమని కోరాను. వాతావరణం బాగోలేదని, సాంకేతిక లోపం కారణంగా విమానాల్ని మార్చామని అబద్ధాలు చెప్పారు. ప్రయాణికుల్ని దాదాపు 4 గంటలపాటు ఇలా చీకటిలో ఉంచడంలో ఎయిరిండియాకు అంత సంతోషం ఏంటో?’ అంటూ మంచు లక్ష్మీ తన ఆవేదనను తెలియజేశారు.